Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో ఎంఎస్25ని విడుదల చేసింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపికకు వెసులుబాటు కల్పించింది. పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వంచే ఆమోదించబడిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయనుండగా.. సంబంధిత కుటుంబం ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని సూచించింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో పథకం అమలు చేయనున్నారు. రెండు గదులతో ఆర్సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరమన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని, సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు, మొత్తం 4లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మనసున్న సీఎం కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం సీఎం కేసీఆర్ ఆశయమని, గృహలక్ష్మి పథకం పేదలకు అందిస్తున్న వరమని చెప్పారు. ఇదిలా ఉండగా.. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మార్చి 9న జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకున్నది.
గతంలో శాసనసభలో ఆమోదం పొందిన విధంగా సొంత జాగా ఉన్న వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమానికి ‘గృహలక్ష్మి’ పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించి.. 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించనుండగా.. మరో 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో అనుమతి ఇవ్వనున్నారు. పథకం కింద లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఈ మేరకు బడ్జెట్ను నిధులను సైతం కేటాయించింది. పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.