హైదరాబాద్ : నూతన జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూతన జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఏర్పడే అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను కేబినెట్ ఆదేశించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో బుధవారం రెండోరోజు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై చర్చించారు.
సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయ పడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదంది. కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలంది. ఆ దిశగా చర్యలకు పూనుకోవాలంది. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాల నుంచి ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.