TS Assembly | ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ‘ఇక్కడో విషయం స్పురణకు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ సభ్యులు సైతం తనతో ఏకీభవిస్తారనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన అనే విషయం 58 సంవత్సరాల సుధీర్ఘ పోరాటం. ఒకరోజుతో, ఒక నాయకుడితో వచ్చింది కాదు. ఈ సుదీర్ఘ పోరాటానికి ఆద్యులు ఎవరు ? ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ. ఇది చరిత్ర. దీన్ని ఎవరూ కాదనలేరు. ఉన్న తెలంగాణ ఉన్నట్టే ఉంటే.. ఎప్పుడు ఎక్కడుంనో.. ఏ దిశలో ఉండునో. తొమ్మిదేళ్లలో ఇంత స్థాయికి వచ్చాం. ఎవరూ ఏం మాట్లాడినా.. ఏ రకమైనా వ్యాఖ్యలు చేసినా.. టీకా టిప్పన్ చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం గానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ యూనిట్ గానీ, దేశం గానీ పెరుగుదల ఉందా? తరుగుదలా ఉందా ? అనే దానికి కొన్ని గీటురాళ్లు ఉంటాయి’ అన్నారు.
‘ఇందులో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఎంత పెరిగితే అంత ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిగణిస్తరు. తెలంగాణ ఏర్పడిన రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది. ఏర్పాటు తర్వాత పెద్ద రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. మన తలసరి ఆదాయం రూ.3.12లక్షల ఉంటే.. మనం ఏ రాష్ట్రం నుంచి మనం విడిపోయామో.. ఎవరైనా మనల్ని ఎకసెక్కాలు పలికారో.. మీకు పరిపాలన రాదు అన్నరో వారి తలసరి ఆదాయం రూ.2.19లక్షలు. రెండురాష్ట్రాల మధ్య రూ.లక్ష వరకు తేడా ఉంది. ఏపీ, తెలంగాణ పదేళ్ల కింద వచ్చిన రాష్ట్రాలు. దాన్ని మించి చాలా స్థిరపడి, చాలాబలంగా ఉండి ఆర్థిక రాజధాని ముంబయి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ అని దేశాన్ని గోల్మాల్ చేసి ప్రధానిని సంపాదించిన గుజరాత్ రాష్ట్రం కావచ్చు. ఎప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్లుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మనకన్నా పెద్ద రాష్ట్రాలు. ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రం కావచ్చు. వీటిన్నింటిని తలదన్ని ఎక్కువ మొత్తంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది తెలంగాణలోనే. ఇది అన్నింటికి ఇండికేటర్. అన్ని రకాల సమ్మిళితమైన అభివృద్ధి జరిగితేనే ఇది సాధ్యం కాదు. ఏ ఒక్క రంగానికే, ఓ ఒక్క వర్గానికో పనులు జరిగితే కాదు. రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ విజయవంతంగా జరిగింది అనేదానికి సూచిక తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం’ అని సీఎం చెప్పారు.
‘ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ? దీనికి ఎవరు బాధ్యులు ? జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆ రోజు తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆనాడు ఉన్న కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వ్యతిరేకించినా ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మాట్లాడితే భట్టి విక్రమార్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటరు. ఆ పార్టీ మన కొంపముంచుకుంది. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్రలో రికార్డయ్యింది. ఇక్కడి నుంచి విమానంలో వెళ్లే సమయంలో రామకృష్ణారావు తెలంగాణ తప్ప మరోమాట లేదని చెప్పారు. ఢిల్లీలో బలవంతంగా ఒప్పించిన తర్వాత.. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నెహ్రూసాబ్ చెప్పిన తర్వాత ఏం మాట్లాడుతాం అన్నారు. ఇది కూడా చరిత్రలో ఉన్నది. ఇది కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్. ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు, జంటిల్మన్ అగ్రిమెంట్ మరొకటి కావొచ్చు.
విడిగొట్టిన సందర్భంలో ఇచ్చిన హామీలు కాలరాస్తే ప్రేక్షకపాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ. చివరకు 1969 ఉద్యమం. ఎంత కర్కషంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల. 56 సంవత్సరంలో ఊగొట్టే సమయంలో అనేకమందిని జైళ్లలో జైళ్లల్లో పెట్టారు. సిటీ కాలేజీ దగ్గర ఫైరింగ్ జరిగితే ఏడుగురు చనిపోయారు. దాన్ని ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేశారు. ఆ తర్వాత 69 ఉద్యమం వస్తే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. చివరకు టీఎన్జీవోలు ఉద్యోగులు సైతం ఉద్యమించారు. ఉద్యమ నేత ఆమోస్పై ఎస్మా, రకరకాల కేసులు పెట్టి జైలులో పెట్టి నిర్బంధించినా ఉద్యమించారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే భద్రి విశాల్ పిట్టి తదితర నేతలు బకిట్లు పట్టుకొనిపోయి దుకాణాల్లో అడిగి.. ఉద్యోగులను కాపాడుకున్నారు. ఇదంతా చరిత్ర. ఎంత రాసి రంపాన పెట్టారో.. ఎంత మందిని కాల్చి చంపారో.. ఆ ఘనత చరిత్ర అంతా కాంగ్రెస్లో పోతది’ అంటూ విమర్శించారు.
‘1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే.. చివరకు తెలంగాణ డెమొక్రటిక్గా 14 ఎంపీ స్థానాల్లో 11 మందిని గెలిపించి.. యావత్ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే.. ఆ నాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అని నిరాకరించారు. ఇది కాంగ్రెస్ చరిత్రనే. ఆ తర్వాత ముల్కి రూల్స్ కొల్లగొట్టబడి.. ఉద్యోగాలు మొత్తం మాయమై.. నీళ్లు మొత్తం పోతావుంటే.. తట్టుపుట్టడు మన్ను తీసి ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పెండింగ్లో పెడితే ఉంటే కూడా మూగ, మౌన ప్రేక్షకపాత్ర వహించింది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే. తెలంగాణ ఎంత యాతనను అనుభవించిందో..? ఎంత బాధను అనుభవించిందో.. ఎంత మంది విద్యార్థులు, యువకులను కోల్పోయిందో.. 69లో కళాశాలలు, హాస్టల్స్లో అన్ని జైళ్లుగా మారాయి. 41 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచింది. ఇది చరిత్రలో మరిపోలేం. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి జ్ఞప్తికి తేవాల్సిన బాధ్యత మాపై ఉన్నది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.