TS Assembly | తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆదివారం శాసనసభలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఉద్యమంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి సాధించిన తీరును వివరించారు. సీఎం ప్రసంగం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పువ్వాడ అజయ్ కుమార్ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది.
అలాగే పురపాలక చట్టం సవరణ బిల్లును సైతం మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది. దాంతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష, అధికార పక్ష నేతలతో పాటు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది సెషన్లలో సజావుగా సాగేందుకు, పద్దులపై చర్చించేందుకు, ప్రశ్నలకు జవాబులు ఇప్పించేందుకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.