రఘునాథపాలెం/ ఖమ్మం, మే 25 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కొవిడ్ బారినపడి మృతిచెందినవారి దహన సంస్కారాలు ఉచితంగా నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం నగరపాలక కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. మంగళవారం ఖమ్మం నగర పరిధిలోని బల్లేపల్లి వైకుంఠధామాన్ని మేయర్ పునకొల్లు నీరజతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మృతదేహాలను దహనం చేసేందుకు అవసరమయ్యే కట్టెలు, ఇతర సామగ్రిని ఖమ్మం కార్పొరేషన్ నుంచే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబీకులనుంచి ఒక్కపైసా వసూలు చేయొద్దని సూచించారు. అంతకు ముందు నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో కొవిడ్ వైద్య చికిత్స, ఇతర వైద్య సేవలపై మంత్రి సమీక్షించారు. సమీక్షలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.