హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్దే అధికారం అని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మొదటి స్థానం టీఆర్ఎస్దే అని తేల్చిచెప్పారు. రెండు, మూడు స్థానాల్లో ఎవరు ఉంటారో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తేల్చుకోవాలన్నారు.
ఎంపీ లింగయ్య యాదవ్ ఇవాళ టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశం, తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరగకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీకి తెలంగాణ పట్ల కక్ష తగ్గి, అభివృద్ధి పథకాలకు నిధులు ప్రకటిస్తారనుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పకుండానే పారిపోయారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తమిళనాడులో జరిగిన రైతు సదస్సులో తెలంగాణ ప్రభుత్వ పథకాలను దేశమంతా అమలు చేయాలని కోరడం శుభసూచకం అన్నారు.
పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారని లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టం కింద తమ ప్రభుత్వం మీద సమాచారం కోరడం కాదు.. బండి సంజయ్కు ఏ మాత్రం సిగ్గున్నా.. మోదీ పాలనపై సమాచారం కోరాలని సూచించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరేడ్ గ్రౌండ్స్లో కేసీఆర్ పాలన పై విమర్శలు గుప్పించారు. అదే పీయూష్ గోయల్ మరుసటి రోజే తెలంగాణకు తన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ ముందు బీజేపీ ఏం చేసినా అవి కుప్పిగంతులే అని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అని ఎంపీ బడుగుల ధ్వజమెత్తారు. రేవంత్ ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణపై ఎలాంటి విజన్ లేదని పేర్కొన్నారు. అభివృద్ధి తప్ప కాంగ్రెస్, బీజేపీ నేతలు అన్నీ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ముందు కాంగ్రెస్, బీజేపీల ఆటలు సాగవని లింగయ్య యాదవ్ హెచ్చరించారు.