సముద్ర తీర రాష్ర్టాల్లో చేపలు ఆరబోసుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద సిమెంటు కల్లాలు కట్టుకోవచ్చట! అందుకు ఒక్కో దానికి రూ.70 వేల దాకా ఖర్చు పెట్టొచ్చట!
కానీ, తెలంగాణ రైతన్న తన ధాన్యం ఆరబోసుకొనేందుకు పంట కల్లాలు మాత్రం కట్టుకోవద్దట. అది నేరమట. ఇచ్చిన పైసలు వాపస్ కట్టాలట! ఇదీ మోదీ సర్కారు నీతి.
ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో ఉపాధి హామీ పథకం పేరుతో నాలుగేండ్లలో మూడు వేల నకిలీ ఖాతాలు తెరిచారు. రూ.మూడు కోట్లు మింగారు. కాగ్ చెప్పినా దీనిపై కేంద్రం అదేమని అడగదు.
కానీ తెలంగాణలో 150 కోట్లతో రైతన్నలు చట్టబద్ధంగా పంటకల్లాలు కట్టుకోవడం మాత్రం దోషమట. తెలంగాణ ప్రభుత్వం ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలట. ఇదీ మోదీసర్కారు రీతి.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుదామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉపాధి నిధులతో తెలంగాణ రైతుల కోసం కల్లాలు నిర్మించుకుంటే మోదీ కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులకు ఉపయోగపడే సిమెంటు కల్లాల నిర్మాణంపై కావాలనే కేంద్రం రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించారు. మంచి కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన సహాయాన్ని ఉపాధి నిధుల మళ్లింపుగా దుష్ప్రచారం చేస్తుండటంపై కేటీఆర్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, తెలంగాణపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
వ్యవసాయాన్ని ఉపాధిహామీ అనుసంధానించాలి
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పదులసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలుమార్లు లేఖలు సైతం రాశామని, పార్టీ తరఫున తీర్మానాలు చేసి పంపించామని తెలిపారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించకుండా, పథకం లక్ష్యాన్నే నీరుగార్చేలా షరతులు, కోతలకు కేంద్రం దిగిందన్నారు. కొవిడ్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చికుకుంటున్నా కేంద్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు.
మోదీ ప్రభుత్వ తీరు దుర్మార్గం
తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎకడా లేనివిధంగా రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే మోదీసరారు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నదని మండిపడ్డారు. తీర ప్రాంతాల్లోని రాష్ర్టాల్లో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదేతరహా సిమెంట్ కల్లాలను ఉపాధిహామీ పథకంలో భాగంగా అకడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయని, వాటిపై లేని అభ్యంతరం తెలంగాణ రైతులు నిర్మించుకున్న పంట కల్లాలపై ఎందుకని నిలదీశారు. తెలంగాణ మీద వివక్షతోనే పనికిమాలిన షరతులను తెరపైకి తెస్తున్నదని మండిపడ్డారు. ఇందులోభాగంగానే 750 కోట్లతో రాష్ట్రంలో చేపట్టిన 79,000 వ్యవసాయ కల్లాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నదని పేర్కొన్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉన్న కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని చెప్పారు. ఉపాధి పనులతో రైతులకు ఉపయోగం కలిగితే తప్పా? అని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైతులకి నేరుగా డబ్బు అందించే రైతుబంధు కార్యక్రమంతో మొదలుకొని రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వివరించారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధి హామీని సాధ్యమైనంత ఎకువగా వినియోగించుకుంటున్న తమ ప్రభుత్వ సదుద్దేశానికి మోదీ ప్రభుత్వం దురుద్దేశాలను ఆపాదిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. వ్యవసాయఅనుబంధ పనులకు ఉపాధి నిధులను ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్నా కేవలం తెలంగాణ రైతులపై కక్ష సాధించేందుకే నిధులు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. రైతులకు ‘మేం సాయం చే యం.. మిమ్మల్నీ చేయనీయం’ అన్నట్టుగా కేంద్రం తీరు ఉందన్నారు.
నేడు జిల్లా కేంద్రాల్లో ధర్నా
మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. అందుకు తెలంగాణ అంగీకరించకపోవడంతో మరో కుట్రకు తెర లేపిందని కేటీఆర్ నిప్పులుచెరిగారు. ‘మన రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా? రాష్ట్ర ప్రభుత్వం కల్లాలను నిర్మిస్తే, ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని అడగడం న్యాయమా? ఇదేనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ?’ అని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినదించాలని ఆయన పిలుపునిచ్చారు.