హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘ఎవుసం చేస్తే ఆరప్పు.. చెయ్యకపోతే మూడప్పు..’! ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రమిది. ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతన్న దశాబ్దాలుగా నష్టపోయి.. అన్యాయమై పోయి.. అలవిగాని అవస్థలు పడ్డడు. స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ముఖం తెల్లవడుతుంటే.. బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నరు. బాయిల్డ్ రైస్ రూపంలో కుట్రలు మొదలుపెట్టిన్రు.. ‘రుబాబ్ రూపాయి.. చెప్పులు సేపాయి’ ఏషాలేశే రాష్ట్ర బీజేపీ నేతలు పంట వేసే దాకా రైతులను రెచ్చగొట్టిన్రు. ఇప్పుడు బట్ట కాల్చి మీదేసినట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నరని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నరు. ఒకప్పుడు బీళ్లతో నోళ్లు తెరిచిన భూములకు.. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి దూప తీర్చిన్రు.
24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుభీమా, నాణ్యమైన విత్తనాలు వంటి పథకాలతో అన్నదాతకు భుజం తోడయ్యారు. కష్టనష్టాల ఊబి నుంచి బయటపడేసిన్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్ల కష్టం ఫలితంగా తెలంగాణ రైతుల ముఖం ఇప్పుడిప్పుడే కాస్త తెలివికి వస్తున్నది. అన్నదాత ముఖం మీద విరబూస్తున్న ఈ చిరునవ్వును చూసి బీజేపీ ఓర్వలేకపోతున్నది. వారిని నిండా ముంచాలని, తిరిగి నడిరోడ్డు మీదికి తేవాలని కంకణం కట్టుకున్నది. ‘బాయిల్డ్ రైస్’ను అడ్డం పెట్టుకొని కుట్ర మొదలు పెట్టిందని తెలంగాణ సమాజం మండిపడుతున్నది. యాసంగిలో పండే ధాన్యం మొత్తం బాయిల్డ్ రైస్గా మార్చాల్సిందేనని తెలిసినా.. సుమారు 60 లక్షల మంది రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నది. ‘బాయిల్డ్ రైస్ కొనేది లేదు’ అని తేల్చి చెప్పింది.
ముందే హెచ్చరించిన ముఖ్యమంత్రి
బీజేపీ కుట్రను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులెత్తి జోడించి మరీ ఈ యాసంగిలో వరి వెయ్యొద్దని విజ్ఞప్తిచేసిన్రు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తీనోరూ మొత్తుకొని చెప్పింది. ఇక్కడే బీజేపీ మరో అత్యంత ప్రమాదకరమైన కుట్రకు తెరలేపింది. ‘నాది కాదంటే ఊరంతా దేకుతా..’ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి గింజ కొనిపిస్తామంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిస్సిగ్గుగా ప్రకటించారు. వీళ్ల ఉత్తుత్తి మాటలు నమ్మి కొందరు రైతులు వరివేశారు. ‘మోసేటోనికి ఎరుక కావడి బరువు..’ అన్నట్టు సీఎం కేసీఆర్ మళ్లీ ఆ రైతుల కష్టాన్ని తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, అన్నదాతలు కలిసి చిట్ట చివరి ప్రయత్నం చేస్తున్నారు.
అయినా కేంద్రం తన మంకుపట్టు విడిచిపెట్టటంలేదు. తెలంగాణ రైతుల పట్ల సానుకూలత.. సానుభూతి చూపించడం లేదు. మోదీకి చెప్పినా ఒకటే.. మొద్దుకు చెప్పినా ఒక్కటే అన్నట్టున్నది పరిస్థితి. కేంద్రం ఇప్పటికీ కొనకుంటే పండించిన పంటంతా కల్లాల్లో, ఇండ్లల్లో మగ్గిపోవాల్సిందే. ఈ పాపం ఎవరిది? కచ్చితంగా రాష్ట్ర బీజేపీదే. వరి వేస్తే ఇబ్బంది తప్పదు, ప్రత్యామ్నాయం చూసుకోండని సీఎం కేసీఆర్ చెప్తే.. తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్రంతో ప్రతి గింజ కొనిపిస్తాం అంటూ బండి సంజయ్, కిషన్రెడ్డి మెదడులేని మాటలు మాట్లాడేశారు.
ధాన్యాన్ని మీ ఇండ్లముదు పోయాలా?
రైతులను ఆదుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేసుకోవచ్చుగా.. అంటూ కేంద్రం ఓ వెకిలి సలహా ఇస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేండ్లుగా సాగునీరు, వ్యవసాయరంగాలకు అత్యధిక నిధులు కేటాయించింది. ప్రాజెక్టులు, పథకాలతో వ్యవసాయ రంగాన్ని గాడిన పడేసింది. ఇక ఇతర రంగాలమీద దృష్టిపెట్టాల్సి ఉన్నది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ధాన్యాన్ని కొనుగోలు చేయగలదా? ఒకవేళ కొన్నా.. ఆ ధాన్యాన్ని ఎక్కడ ఉంచాలి? వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యం దేశంలో ఏ రాష్ర్టానికైనా ఉన్నదా? ఎఫ్సీఐకి తప్ప దేశంలో ఏ రాష్ర్టానికీ సాంకేతిక గోదాములు లేవు. రైతులు కూడా తినేంత ధాన్యాన్ని ఉంచుకున్న తర్వాతే మిగతావి అమ్ముతారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ధాన్యాన్ని కొని ఎక్కడ దాస్తుంది? బీజేపీ స్టేట్ ఆఫీస్లో పోయాల్నా? లేకుంటే బండి సంజయ్ ఇంట్లో పోయా ల్నా? కిషన్రెడ్డి ఏమన్నా ఇంటికి తీసుకొని పోతడా? అని టీఆర్ఎస్ వర్గాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మొత్తం కేంద్రమే కొంటదని గప్పాలు కొట్టిన దద్దమ్మలు ఇప్పుడు యాడ పండుకున్నరని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నరు. ‘చెట్లకు చెదలు పట్టినట్టు.. పంటకు పురుగు పట్టినట్టు.. తెలంగాణకు ఈ బీజేపీవోళ్లు మోపయిన్రు. వాళ్లను నమ్ముకుంటే పెయ్యిమీద బట్టగూడ మిగులది.
ఆ పార్టీ నేతల బట్టేవాజ్ మాటలను నమ్మి తెలంగాణ రైతుల్లో కొందరు మోసపోయి వరి సాగు చేసిన్రు. కడుపు తీపి సంపుకోలేక సీఎం కేసీఆర్ వారి తరఫున ఢిల్లీలో కొట్లాడుతున్నరు. ఒకవేళ కేంద్రం దిగివస్తే ఆ రైతన్నలకు న్యాయం జరుగుతది. లేకపోతే ఈతరానోన్ని నమ్మి చెరువుల దుంకినట్టే.. నిండా మునుగాల్సిందే’ అని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. పసుపుబోర్డు తెస్తా అని బాండ్ రాసిచ్చి పారిపోయినోడు.. బండి పోతే బండి, కారుపోతే కారు అనుకుంట కారుకూతలు కూసేటోడిని నమ్మినందుకు తగిన శాస్తి చేయాల్సిందనని తెలంగణ సమాజం అంటున్నది.
వీళ్లకు పద్ధతి తెలుసా?
యాసంగి సాగుపై బీజేపీ నేతల ప్రవర్తన చూస్తుంటే వీళ్లకు కాస్తయినా బుద్ధి ఉన్నదా? పద్ధతి తెలుసా? మెదడు తలలోనే ఉన్నదా? అని అనుమానం కలుగుతున్నదని తెలంగాణ వాదులంటున్నారు. ఒక రాష్ట్రంలో పండిన పంటను కొనాల్సింది ఎఫ్సీఐ. ఆ సంస్థ ఎంత కొంటామో చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరించి ఇస్తుంది. తెలంగాణలో యాసంగిలో పండే పంటను కచ్చితంగా బాయిల్డ్ రైస్గా మార్చాల్సిందే. ఈ అలవాటు చేసిందే ఎఫ్సీఐ. దశాబ్దాలుగా బాయిల్డ్ రైస్ కొన్న ఎఫ్సీఐ ఇప్పుడు అడ్డం తిరిగిందని, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పేసిందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
ఎఫ్సీఐ వద్దు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు చేయాల్సిన అవసరం లేనట్టేనని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు వివరించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్, కిషన్రెడ్డి కలిసి సీఎం కేసీఆర్ శ్రమను సర్వనాశనం చేశారని, అడ్డగోలు మాటలతో రైతులను రెచ్చగొట్టి పంటలు వేయించారని మండిపడుతున్నారు. రాష్ట్ర రైతాంగంలో 60 శాతం మంది సీఎం కేసీఆర్ మాట వింటే.. మిగతావారు బీజేపీ తప్పుడు మాటలు నమ్మి నిట్టనిలువునా మునిగిపోయారని పేర్కొంటున్నారు. సాధారణంగా యాసంగిలో 60 లక్షల ఎకరాలకుపైగా వరి సాగయ్యేది. ప్రస్తుతం 35 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యింది. అంటే దాదాపు 40 శాతం మంది వరికి దూరంగా ఉన్నారు. బీజేపీ దద్దమ్మలను నమ్మిన ఆ 40 శాతం మంది.. ఆ ధాన్యాన్ని ఏం చేసుకోవాలో ఆలోచించుకోవాలని పలువురు అంటున్నారు.
తెలివి లేని మాటలు.. పనికిరాని సలహాలు
తెలంగాణ రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కేంద్రంతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఎఫ్సీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పింది. పైగా ‘రాష్ట్రమే కొని ఎగుమతి చేసుకోవాలి’ ఎఫ్సీఐ, బీజేపీ నేతలు ఉచిత సలహా పడేశారు. ‘నిన్నటి దాకా వడ్లు కొన్న పైసల్ మాయే అన్నోడు ఇయ్యాల మీరే కొనాలే అని అంటున్నడు. ఇది నిజంగానే తెలివి ఉండి.. తెలిసి ఉండి చేసిన వ్యాఖ్యలేనా?. గుజరాత్, మధ్యప్రదేశ్ ఇలా దేశంలోని ఏ రాష్ట్రమైనా సొంతంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదా? అసలు అలాంటి విధానం ఉన్నదా? ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్రాన్ని కాదని ఎగుమతులు చేసే అధికారం ఉన్నదా? అని పలువురు రైతుల నాయకులు బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.
‘రైతులకు మొఖం చూపెట్టే తెలివి లేక.. విషయాన్ని దారి మళ్లించేందుకు ఇందిరాపార్క్ దగ్గర, జిల్లాల్లో దిక్కుమాలిన రాజకీయ ధర్నాలను మొదలుపెట్టిన్రు. కేంద్రంపై పోరాడే దమ్ము లేక.. సిగ్గులేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడుతున్నారు. ‘కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం సహా రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీకి పోయి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. అయినా ఈ దుర్మార్గపు బీజేపీ నేతలు కనీసం వారికి సంఘీభావం తెలుపడం లేదు. ఢిల్లీలో కూర్చొని కేంద్రం మెడలు వంచాల్సింది పోయి.. సిల్లీగా ఇందిరాపార్క్ గల్లీలో కూర్చొని మొసలి కన్నీరు కార్చుతున్నారు’ అంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.