హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు తెలివైనవారు. ఉద్యమ సమయంలో అన్నిరకాల కుట్రలను ఎదుర్కొన్న అనుభవం.. ఈ గడ్డ ప్రజలను ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండేలా చేసింది. గద్దెలను కూల్చే గద్దలు కాచుకొని కూర్చుంటాయని, ప్రజాప్రభుత్వాలను పడగొట్టే కుట్రలుంటాయని వారికి ముందే తెలుసు. అందుకే అఖండ మెజారిటీని అందించి, ఉద్యమపార్టీ టీఆర్ఎస్ను అసెంబ్లీలో సమున్నతస్థానంలో నిలబెట్టారు. ఎన్నికలు, బైఎలక్షన్లలో 88మందిని నేరుగా గెలిపించి, టీఆర్ఎస్ను శక్తిసంపన్నం చేశారు. కేసీఆర్ చాణక్యానికి తెలంగాణ చేతనతోడవడంతో.. రాజకీయ శక్తుల పునరేకీకరణ సాధ్యమైంది. పాలన నచ్చి వివిధ పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వచ్చి చేరారు. దాంతో టీఆర్ఎస్ బలం 104కు చేరగా, ఒక నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యేతో కలుపుకొంటే ఆ బలం 105. అంటే, మొత్తం అసెంబ్లీలో ఇప్పుడు టీఆర్ఎస్ బలం 88.24శాతం. ప్రస్తుత తరుణంలో అసెంబ్లీలో అత్యధికశాతం సంఖ్యాబలం కలిగిన పార్టీలు యావత్దేశంలో మూడే మూడు. అందులో టీఆర్ఎస్ ఒకటి. ఢిల్లీ అసెంబ్లీలో 88.57శాతం సభ్యులతో ఆమ్ఆద్మీపార్టీ మొదటిస్థానంలో ఉండగా, స్వల్ప తేడాతో 88.24శాతంతో టీఆర్ఎస్ తర్వాతిస్థానంలో ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 88శాతం సంఖ్యాబలంతో వైసీపీ మూడోస్థానంలో ఉన్నది. ఈ ఘనత సాధించిన మూడు బీజేపీయేతర పార్టీలు కావడం విశేషం.
తెలంగాణ అసెంబ్లీలో అజేయశక్తిగా టీఆర్ఎస్ అవతరించింది. రాష్ట్రంలో 120 అసెంబ్లీ స్థానాలుంటే.. అందులో 105 టీఆర్ఎస్వే. ఇందులో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 104. ఒకరు ఆంగ్లో-ఇండియన్ కోటాలో నామినేట్ అయిన ఎమ్మెల్యే. అంటే మొత్తం అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యాబలం 88.24శాతం. సీఎం కేసీఆర్ అడుగులో అడుగేసి రాష్ట్ర ప్రజలు నడుస్తున్నారని ఈ నెల 3న జరిగిన మునుగోడు ఉపఎన్నికల ఫలితమే స్పష్టం చేసింది. దేశంలో ఒకటీ రెండు మినహా మరే పార్టీ కూడా ఆయా అసెంబ్లీల్లో ఇంత భారీ సంఖ్యాబలం కలిగి లేదు. తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా టీఆర్ఎస్ను ప్రజలు చూస్తున్నారని చెప్పేందుకు ఇదే ఓ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పొత్తిళ్ల నుంచే పోరాటం
తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించి..అసలు రాష్ట్ర ఉనికినే లేకుండా చేయాలని రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లల్లోనే భారీ కుట్రలు జరిగాయి. చంద్రబాబు డైరెక్షన్లో ‘ఓటుకు నోటు కేసు’ కుట్ర బాగోతం బయటపడింది. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నానికి తొలి కుట్ర జరిగింది అప్పుడే. ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు.. అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రూ. 5 కోట్లతో అడ్డంగా దొరికిపోయారు. దానిని రాష్ట్ర ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించిన తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంట నడవాలని ఆయా పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచింది. ప్రజాభీష్టం మేరకు తాము టీడీపీలో ఉండబోమని 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేశారు. మరోవైపు 2014లో టీఆర్ఎస్ నుంచి 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 2018 ఎన్నికల్లో అది 88 స్థానాలకు విస్తరించింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్వితీయంగా పురోగమిస్తున్న నేపథ్యంలో.. ప్రగతియజ్ఞంలో తాము కూడా భాగస్వాములమవుతామని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చట్టబద్ధంగా తమ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. వీరితోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోరుకంటి చందర్, రాములు నాయక్ టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
అజేయశక్తిగా టీఆర్ఎస్
రాష్ట్ర అసెంబ్లీలో 105మంది (ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని కలుపుకొని) ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో టీఆర్ఎస్ అజేయంగా కొనసాగుతున్నది. ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒక రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 88 శాతం సభ్యులున్న పార్టీగా టీఆర్ఎస్ అపూర్వ విజయాన్ని రికార్డు చేసుకున్నది. ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి వచ్చామని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీ.. ఈ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో 254 సీట్ల (63.02శాతం)ను మాత్రమే సాధించింది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ గెలిచింది 119మంది (53.12శాతం) ఎమ్మెల్యేలు మాత్రమే. అస్సాంలో 126 స్థానాలకుగాను 63 స్థానాలు (50శాతం), అంతెందుకు నిన్నటిదాక అధికారం చెలాయించి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీకి 182 స్థానాల్లో 111 స్థానాల (60.98శాతం)తోనే పాలన సాగించింది.
గెలవలేని చోట పడగొట్టడమే పనిగా…
గెలవలేని చోట పడగొట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్నది. తమకు సంఖ్యాబలం లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాలను కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నది. బీజేపీ అధికారం చేపట్టిన అనేక రాష్ర్టాల్లో ఆ పార్టీ సంఖ్యాబలం అంతంత మాత్రమే. అయినా అధికారమే పరమావధిగా కూలదోసుడు వ్యవహారాలను నడుపుతున్నది. అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, పుదుచ్చేరి, మహారాష్ట్ర, సిక్కిం.. ఈ 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను బీజేపీ దొడ్డిదారిన కూల్చింది. రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను పడగొట్టాలని మోదీ అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్ని అడ్డంగా దొరికిపోయిన బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. తెలంగాణను అస్థిర పరచాలని 2014 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలను సీఎం కేసీఆర్ దార్శనికతతో ఎదుర్కొన్నారు. అలాగే ఇప్పుడూ అదే ఒరవడిని కొనసాగిసున్నారు. అనేక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న విజయాలకు అడ్డుకట్టవేయాలని బీజేపీ చేసిన కుట్రలను కేసీఆర్ మరోసారి ఛేదించారు.