హైదరాబాద్; మే 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, విభజన హామీలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి సబిత శుక్రవారం రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె అమిత్షా తెలంగాణ పర్యటనపై ఘాటుగా స్పందించారు. విభజన హామీలను నెరవేర్చకుండా, రాష్ట్ర పర్యటనల పేరుతో తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
‘అమిత్షా తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? తెలంగాణకు ఏం ఇవ్వబోం, నవోదయ పాఠశాలలు ఇచ్చేది లేదు, ఐఐటీ, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఇవ్వబోం, విభజన చట్టం హామీలు అమలు చేసేది లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వబోము అని చెప్పడానికి వస్తున్నారా’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన హామీలు అమలుచేయడంలో విఫలమయ్యామని అమిత్షా ఒప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకుండా, విధానాలు చెప్పడానికి తెలంగాణకు రావాలని సూచించారు. తాము లేవనెత్తిన అన్ని అంశాలకు తుక్కుగూడ సభలో అమిత్షా సమాధానం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామని అమిత్ షా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ను తెలంగాణకు కేటాయిస్తామని అనగలరా?’ అని నిలదీశారు.
బండిది బీజేపీ సంఘర్షణ యాత్ర
బీజేపీకి విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండా అని మంత్రి సబిత విమర్శించారు. ఇందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నెలరోజులుగా చేస్తున్న యాత్రలో చేస్తున్న ప్రసంగాలే నిదర్శనమని అన్నారు. బండి సంజయ్ది ప్రజాసంగ్రామ యాత్ర కాదు.. బీజేపీ అంతర్గత సంఘర్షణ యాత్ర అని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గానికి ఏం చేశావని ప్రశ్నించే ముందు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తెలంగాణకు కేంద్రప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటిక, డంపింగ్యార్డుల్లో తమ వాటా ఉందంటున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు దేశమంతా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో సంజయ్ వివరిస్తే.. మహేశ్వరం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని సవాల్ చేశారు.
మా ప్రభుత్వానికి స్టార్ క్యాంపెయినర్లు!
టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి బీజేపీ నేతలు స్టార్క్యాంపెనర్లుగా మారారని మంత్రి సబిత అన్నారు. ‘బండి సంజయ్ పాదయాత్రలో దప్పికేస్తే మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు.. పల్లె ప్రకృతి వనాల్లో సేద తీరుతున్నారు. 24 గంటల కరెంటుతో పాదయాత్ర ఇబ్బంది లేకుండా సాగుతున్నది’ అని చెప్పారు. పాదయాత్రలో ప్రజలు కేసీఆర్ చేసిన మేళ్ల గురించి అడుగడుగునా వివరిస్తున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్త చనిపోతే.. ఆ పార్టీ ఆదుకోలేదు కానీ.. కేసీఆర్ రైతుబీమా ఆదుకున్నదని ఓ మహిళ సంజయ్కు చెప్పడమే సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు.
ప్రజలను గోస పెడుతున్న కేంద్రం: మంచిరెడ్డి కిషన్రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని గోస పెడుతున్నదని రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కేంద్రం క్రూడ్ ఆయిల్, వంట నూనెలు ధరలు పెంచు తూ ప్రజల నడ్డి విరుస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో సలహాలు ఇవ్వొచ్చని, కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు.
కొత్త బిచ్చగాడిలా సంజయ్: జైపాల్ యాదవ్..
బండి సంజయ్ కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విమర్శించారు. బీజేపీ ఎంపీలు అసలు పార్లమెంటరీ భాషనే మరచిపోయి బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మోకాలి యాత్ర చేసినా, అరగజం భూమి కుంగేలా నడిచినా.. ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఊదు కాలదు.. పీరు లేవదు: ఎంపీ రంజిత్రెడ్డి
బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ అభివృద్ధిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెవేళ్ల ఎంపీ గడ్డం రజింత్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు నీరు రాలేదని పచ్చి అబద్ధం చెప్పారని అన్నారు. తెలంగాణ అప్పులపై కేంద్రం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కొవిడ్ తర్వాత తెలంగాణ అప్పులు 28 శాతం పెరిగితే.. కేంద్ర ప్రభుత్వం అప్పులు 60 శాతం ఎందుకు పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో ఊదు కాలదు.. పీరు లేవదని ఎద్దేవా చేశారు. వారికి తిట్లు తప్ప ఏమీ తెలియదన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నామని చెప్పడానికి అమిత్షా వస్తున్నారా ? అని ప్రశ్నించారు.