కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత హుజూరాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోతిరెడ్డిపేట, ఆఖరున శంభునిపల్లి ఓట్లను లెక్కించనున్నారు.
ఉదయం 9:30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.