3000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
ఆహ్వానితులే రావాలి: మంత్రి కేటీఆర్
27న గ్రామాలు, మున్సిపాలిటీల్లో
పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపు
హెచ్ఐసీసీలో ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన
మసీద్ బనేగా.. చర్చి బనేగా మందిర్ బీ బనేగా. అన్ని మతాలను గౌరవించే రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ పాలనలో సమ ప్రాధాన్యం. – సెక్రటేరియట్లో ఆలయ నిర్మాణంపై నెటిజన్ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ జవాబు
హైదరాబాద్, ఏప్రిల్ 17, (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ ఆవిర్భవించి 21 ఏండ్లు పూర్తిచేసుకొని, 22వ వసంతంలోకి అడుగుపెడుతున్నదని చెప్పారు.
ప్లీనరీలో రాష్ట్ర, జాతీయ తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై సవివరంగా చర్చించి పార్టీ వైఖరిపై శ్రేణులకు స్పష్టత ఇస్తూ తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ వైఖరిని ప్రస్ఫుటం చేస్తూ తీర్మానాలతోపాటు అభివృద్ధి, సంక్షేమంపై తీర్మానాలు ఉంటాయని వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 12,769 గ్రామాల్లో పార్టీ గ్రామ అధ్యక్షులు, మున్సిపాలిటీల్లోని 3,618 వార్డు, డివిజన్లలో అక్కడి పార్టీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ పతాకాల ఆవిష్కరణను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్యులతో సోమవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు.
మూడు వేల మందికి ఆహ్వానం
ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కేటీఆర్ కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, మహిళా కో-ఆర్టినేటర్లు సుమారు 3 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరికొందరికి అనుమతి ఉంటుందని చెప్పారు. ఆహ్వానితులకు పాసులు జారీచేస్తామని తెలిపారు. ఆహ్వానం లేనివారికి ప్రవేశం ఉండదని స్పష్టంచేశారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.
మందిర్ భీ బనేగా.. మసీద్ భీ బనేగా..
కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం
అన్ని మతాలను గౌరవించే రాష్ట్రం తెలంగాణ
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాల వారు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో ప్రభుత్వం నిర్మిస్తున్న దేవాలయం గురించి ప్రశాంత్యాదవ్ అనే నెటిజన్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ను అడిగారు. దీంతో ‘మందిర్ భీ బనేగా.. మసీద్ భీ బనేగా.. చర్చ్ భీ బగానే.. మీరేం ఆందోళన చెందకండి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలను గౌరవించే తెలంగాణ ఉన్నది’ అని సమాధానమిచ్చారు. మతం ముసుగులో రాజకీయాలు చేయబోమని స్పష్టంచేశారు.