అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ధాన్యాన్ని పూర్తిగా సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. కేంద్రం మొండిచేయి చూపినా వానకాలం సీజన్లో రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్రం వైఖరిని దృష్టిలో పెట్టుకొని రైతులు యాసంగిలో వరికి బదులు లాభదాయక పంటలు సాగు చేయాలని సూ చించారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పల్లా మాట్లాడారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. మరింత అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధును అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
రూ.44 వేల కోట్లతో జిల్లా అభివృద్ధి: తుమ్మల
సీఎం కేసీఆర్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను రూ.44 వేల కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాకు అవసరమైన అన్ని అత్యవసర పనులనూ పూర్తి చేసినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని సూచించారు. అభ్యర్థి మధు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తనను ఆశీర్వదించి భారీ మెజారిటీ అందించాలని కోరారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు గెలుపు ఖాయమని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.