హైదరాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడే బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలుపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర భారతదేశానికో నీతి, దక్షిణ భారతదేశానికో నీతి అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
కేసీఆర్ తెలంగాణ, రైతు వ్యతిరేకి అని గోయల్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అయితే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో ఎందుకు పండిందని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నలుగురు బీజేపీ ఎంపీలు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పీయూష్ గోయల్ వెలికి వేషాలు మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని వ్యాఖ్యానించిన గోయల్.. రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు పీయూష్ దగ్గరికి వెళ్లి తెలంగాణ ధాన్యం కొనాలని డిమాండ్ చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు.