హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి? అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈటల ఆయన అభివృద్ధి చూపిస్తే.. తాను కేసీఆర్ అభివృద్ధి చూపిస్తానని తేల్చిచెప్పారు. హుజురాబాద్కు చేసింది ఏముందని.. గజ్వేల్కు పోతా అంటున్నావ్? అని నిలదీశారు. ఈటల తాను చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు హుజురాబాద్ చౌరస్తాను 5వ తేదీన బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆ రోజే ఈటల చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాజేందర్ సొంత గ్రామం కమలాపూర్లో బస్టాండ్ నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితి ఆయనదని పేర్కొన్నారు. ఈటల హుజురాబాద్లో యాక్టర్.. హైదరాబాద్లో ఒక జోకర్.. ఢిల్లీలో బ్రోకర్ అని విమర్శించారు. బండి సంజయ్ ఈటలను ఒక జోకర్లాగా చూస్తున్నాడని తెలిపారు. ఈటల ఒక బ్రోకర్ అని స్వయంగా సొంత పార్టీ నాయకులే అంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి మర్యాద ఈటలకే దక్కిందని గుర్తు చేశారు.
హుజురాబాద్కు ఎస్డీఎఫ్ నిధుల కింద కేసీఆర్ రూ. 100 కోట్లు ఇచ్చారని కౌశిక్ రెడ్డి తెలిపారు. జీవో 295తో రూ. 6 కోట్లు నిధులు మంజూరు చేసి రాజేందర్ ఇంటికి రోడ్డు నిర్మాణం చేశారని చెప్పారు. ఈటల మళ్లీ హుజురాబాద్లో గెలిచి 10 నెలలు కావొస్తుంది. ఈ 10 నెలల్లో ఆయన కేంద్రం నుంచి ఒక్క లక్షనైనా తెచ్చి ఖర్చు చేశారా? అని అడిగారు. ఈటలకు దమ్ముంటే కేంద్రం నుంచి రూ. 100 కోట్లు తెస్తే.. తాను టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రూ. 120 కోట్లు తెస్తానని తేల్చిచెప్పారు.