నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్కు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత.. శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి సీ నారాయణరెడ్డి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు.
అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారు. ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన అన్ని పార్టీల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను అని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.