నందిపేట్, జూన్ 7 : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు నాలుగో రోజైన మంగళవారం వైభవంగా సాగాయి. దేవతా మూర్తుల ప్రాణ ప్రతిష్ఠలో ఫల, పుష్ప, శయ్య, ధాన్య, ధనాధివాసాలను నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర నియమాల అనుసారం సాగిన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేసింది. ఈ వేడుకలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-అనిల్కుమార్, నవలత-రాంకిషన్రావు, దేవనపల్లి అరుణ్-ననిత దంపతులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
నాలుగో రోజు ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సేవాకాలం నివేదన, మంగళాశాసనాలు, వేద విన్నపాలు, ద్వారా తోరణ ధ్వజకుంభారాధన, చతుః స్థానార్చన, అగ్ని ముఖం మూలమంత్రమూర్తి మంత్రహవనం, పంచసూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్యపూర్ణాహుతి, శాత్తుమోరై కార్యక్రమాలను భక్తజనరంజకంగా నిర్వహించారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ప్రారంభమైన సాయంకాల కార్యక్రమాలు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయానికి ప్రముఖుల రాకతో సందడి నెలకొన్నది. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.