హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో సునీత పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఈ ధర్నా చేపట్టామని తెలిపారు. తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా ధర్నాకు వచ్చారు. సీఎం కేసీఆర్కు రైతులు అండగా ఉన్నారు. ఈ ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. కేసీఆర్ సీఎం అయిన వెంటనే రైతులకు భరోసా కల్పిస్తూ రుణాలు మాఫీలు చేశారు. సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తూ రైతులకు అండగా నిలబడ్డారు. యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే.. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్లు ప్రయోగించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చెరువును, కుంటను మిషన్ కాకతీయ పథకంతో అభివృద్ధి చేశారు. ఇలాంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలేదు. ప్రతి కుంట, చెరువు అలుగు పారుతుందంటే మిషన్ కాకతీయ వల్లే సాధ్యమైందన్నారు.
ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులు అప్పులు చేయొద్దనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఈ ధర్నా చేపట్టాం. వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై సంజయ్ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. కచ్చితంగా రాబోయే యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేయాలి అని సునీత డిమాండ్ చేశారు.