దళితులు అధిక సంఖ్యలో హాజరుకావాలి
ఇంచార్జ్లకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ పిలుపు
హుజురాబాద్ : ఈ నెల 16న హుజురాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించే దళిత బంధు సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజురాబాద్ మండలంలోని సింగాపురం గ్రామంలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఇంచార్జ్లు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా అమలు చేయలేదన్నారు. దళిత బంధు సభకు దళితులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించి.. కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు.
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం హర్షణీయమన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు. దళిత బంధు సభకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు వకుళాభరణం కృష్ణ మోషన్ రావు, జడ్పీటీసీ పడిదం బక్కరెడ్డి, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సంగెం అయిలయ్య, ఎడవెల్లి కొండల్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేతిరి రాజా ప్రతాప రెడ్డి, కన్నవేని శ్రీనివాస్, దాసరి రమణ రెడ్డి, మోలుగురి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.