హుజూరాబాద్ : హుజూరాబాద్ పోటీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కడికే లాభం.. అదే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ప్రజలందరికీ లాభం జరుగుతుందన్నారు. కమలాపూర్లోని ఖాసీంపల్లిలో ఏర్పాటు చేసిన తుర్క కాశ ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరై ప్రసంగించారు.
ఈటల రాజేందర్ అధికార పార్టీలో ఉండి తప్పుడు పనులు చేశారు. పదవులు రాగానే అడ్డదారులు తొక్కుతూ.. అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటూ.. అంతస్తులు పెంచుకుంటూ ముఖ్యమంత్రి కుర్చీ మీదనే కన్నేసిండు. కేసీఆర్ మద్దతుతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులతో చేతులు కలిపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యతిరేక పనులు చేశారు. ఎస్సీ భూములను కబ్జా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించారు.
ఇవాళ ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు లాభం.. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలందరికీ లాభం.. అలాంటప్పుడు ఒక్కడి గెలుపు కావాలా.. ప్రజలందరి గెలుపు కావాలా..? అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ర్టం, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని బాల్క సుమన్ స్పష్టం చేశారు.