హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ది త్యాగాల కుటుంబమైతే.. బీజేపీది భోగాల కుటుంబమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని, అనేక సందర్భాల్లో తెలంగాణ పట్ల బహిరంగంగానే వ్యతిరేకతను ప్రదర్శించారని విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏ జీవన్రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం సిగ్గు చేటని, బీజేపీ నిండా కుటుంబ వారసులే ఉన్నారని గుర్తు చేశారు. దావోస్లో కేటీఆర్ భారత్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతూ పెట్టుబడులు ఆకర్షించారని తెలిపారు. యువత బీజేపీకి ఎందుకు మద్దతు పలకాలి? యువతకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను రోడ్డున పడేశారని, నిరుద్యోగాన్ని పెంచినందుకు మోదీకి తెలంగాణ యువత మద్దతివ్వాలా? సుమన్ నిలదీశారు.
కార్పొరేట్ల కోసమే మోదీ ఆరాటం
మోదీ అంతటి అసమర్ధ ప్రధానిని ఇప్పటివరకూ చూడలేదని బాల్క సుమన్ అన్నారు. నియంతలకు పట్టిన గతే మోదీకి కూడా పడుతుందని హెచ్చరించారు. దేశాన్ని మోదీ అమ్ముతుంటే, తెలంగాణను సీఎం కేసీఆర్ నిలబెడుతున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి 10 శాతం బొగ్గు దిగుమతి చేసుకోవాలని పవర్ప్లాంట్లకు ఆంక్షలు పెట్టడం అదానీ కోసం కాదా? అని నిలదీశారు. ‘మోదీ నయ వంచకుడు, అబద్ధాలకోరు. కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాను చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు కేసీఆర్ను విమర్శిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు.
కుటుంబ రాజకీయాల చరిత్ర బీజేపీదే: జీవన్రెడ్డి
కుటుంబ రాజకీయాల చరిత్ర బీజేపీదేనని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, ధర్మేందర్ ప్రధాన్, వసుంధరా రాజే, పంకజ్ సింగ్, లడ్డా బహుగుణ తదితర నాయకులంతా కుటుంబ వారసులు కాదా? అని ప్రశ్నించారు. బాల్, బ్యాట్ పట్టుకోవడం రాని అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శిగా ఎలా ఉన్నారని నిలదీశారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ తెలంగాణ ఉద్యమకారులని గుర్తు చేశారు.
ఒక కేసీఆరే కాదు.. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు తనకు ఎందుకు స్వాగతం పలకడం లేదో మోదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు తెలంగాణలో ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారని, వారిని ప్రజలే వెలివేస్తారని హెచ్చరించారు.
కేసీఆర్ను చూస్తే బీజేపీకి దడ ;ఎంపీ లింగయ్య యాదవ్
సీఎం కేసీఆర్ను చూస్తే బీజేపీకి దడ పుడుతున్నదని, కేసీఆర్ ఎజెండాతో పీఠం కదులుతుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై మోదీ పార్లమెంట్లోనే వ్యతిరేక వైఖరి చాటుకొన్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభంజనాన్ని బీజేపీ కాంగ్రెస్ అడ్డుకోలేవని స్పష్టంచేశారు. ఓటుకు నోటు దొంగ రేవంత్రెడ్డి పిచ్చి ప్రేలాపనలు జనం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.