జమ్మికుంట : జమ్మికుంట మండల పరిధిలోని నాగంపేట, గండ్రపల్లి గ్రామాల్లో రూ. 2 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జమ్మికుంట రూరల్ ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గండ్రపల్లి, నాగంపేట గ్రామాలకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు బడుగు, బలహీన వర్గాలకు ఎంతో దోహదపడుతాయని చెప్పారు.
దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే ఆరూరి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
జమ్మికుంట మండలంలోని నాగంపేట, గండ్రపల్లి గ్రామాలకు చెందిన 40 మంది లబ్దిదారులకు కొత్తగా మంజూరు అయిన పెన్షన్లను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ మమత, జడ్పీటీసి శ్రీరాం శ్యామ్, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షురాలు కడవేరు మమత, సర్పంచులు పద్మ, స్వాతి, ఎంపీటీసీలు కవిత, రాజయ్య, మాజీ జడ్పీటీసీ వీరేశం, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.