యాదాద్రి లక్ష్మీనరసింహుడి కలశ పూజోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసమేతంగా విచ్చేసిన వివిధశాఖల మంత్రులు, నేతలు తమకు కేటాయించిన రాజగోపురాలు, మండపాల వద్ద కలశాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సప్తగోపురాలకు ఏకకాలంలో కుంభాభిషేకాన్ని కాళేశ్వర జలాలతో శాస్ర్తోక్తంగా సంప్రోక్షణ జరిపారు. ప్రధానాలయం నలువైపులా ఐదు అంతస్తుల్లో 55 అడుగుల ఎత్తుతో నిర్మిం చిన పంచతల రాజగోపురాలకు తొమ్మిదేసి చొప్పున కలశాలను ప్రతిష్ఠించారు. ఏడంతస్తుల్లో 77 అడుగుల ఎత్తులో నిర్మించిన సప్తతల మహారాజగోపురంపై 11, మూడంతస్తుల్లో 33 అడుగుల ఎత్తులో నిర్మించిన త్రితల రాజగోపురంపై ఐదు కలశాలు, దివ్య విమాన గోపురంపై ఉన్న శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి, మిగిలిన ఆరు గోపురాల కలశాలలకు, అష్టభుజి మండపాలు, ఉపాలయాల కలశాలలతో కలిపి మొత్తం 82 కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్విక్కుల సమక్షంలో మహాకుంభ సంప్రోక్షణ జరిగింది.
\