ఉమ్మడి రాష్ట్రంలో అడపాదడపా ఉద్యోగ నోటిఫికేషన్లు. పోస్టుల సంఖ్యా స్వల్పమే. మొక్కుబడిగా ఉద్యోగాల భర్తీ. అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ విధానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కడం అనుమానమే.
మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో భారీ నోటిఫికేషన్లు.
నాణ్యమైన కోచింగ్ ఇచ్చే బాధ్యతను సైతం భుజానికెత్తుకున్నది టీఆర్ఎస్.
తెలంగాణ ఆత్మ, ప్రేమ మదినిండా నిండిన మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరుద్యోగులకు అండగా నిలిచారు.
మన పిల్లలు ఉద్యోగాలు సాధించాలె, ఉన్నత స్థానాలకు చేరుకోవాలె, అందుకు నేను సహాయం అందించాలె అని ఎవరికివారు సంకల్పించారు. సీఎం కేసీఆర్ పిలుపుతో తమ తమ ప్రాంతాల్లో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. తాము స్థాపించిన సేవాసంస్థల ద్వారా ఉద్యోగాల సాధనలో యువతకు తోడ్పాటును అందిస్తున్నారు. దీంతో ఉద్యోగార్థులు ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అవుతున్నారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ‘వేరే వ్యక్తులకు, వేరే పార్టీలకు రాజకీయాలు ఒక గేమ్. కానీ టీఆర్ఎస్కు ఒక టాస్క్. పవిత్ర కార్యం. మేం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజల పక్షాన ఆలోచిస్తాం. సీరియస్గా అమలు చేస్తాం. ఎందుకంటే మేము ఈ రాష్ర్టాన్ని తెచ్చినవాళ్లం’.. గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. సీఎం మాట రాష్ట్రంలో ఇప్పుడు నూటికి నూరుపాళ్లు ఆచరణలో కనిపిస్తున్నది. ప్రజాప్రతినిధులంటే ప్రసంగాలు దంచి పోయేవాళ్లు కాదని టీఆర్ఎస్ నేతలు నిరూపిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు ఎవరి పరిధిలో వాళ్లు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు పెట్టి సకల సౌకర్యాలతో కోచింగ్ చెప్పిస్తూ రాజకీయాల్లో తాము ప్రత్యేకమని చాటుతున్నారు. ఒకరిద్దరు తప్ప ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలెవరూ అలాంటి ఆలోచన కూడా చేయకపోవటం ప్రజల పట్ల వారి చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తున్నది.
భోజనం, కోచింగ్, నివాసం
రాష్ట్రప్రభుత్వం ఒకేదఫాలో 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో లక్షలమంది నిరుద్యోగులు చావోరేవో అన్నంత పట్టుదలగా ప్రిపేరవుతున్నారు. వీరిలో చాలామంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులే. వారికి ప్రైవేటులో వేలకువేలు పెట్టి కోచింగ్ తీసుకొనే స్థోమత లేదు. ఈ పరిస్థితిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్, వారికి అండగా ఉండాలని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు సూచించారు. సీఎం చెప్పిందే ఆలస్యం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ కోచింగ్ సెంటర్లను ఏర్పాటుచేసి అత్యుత్తమ బోధకులతో పోలీస్, గ్రూప్స్ తదితర ఉద్యోగాలకు కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ కోచింగ్ సెంటర్లలో యువకులు, యువతులతోపాటు చంటిపిల్లల తల్లులు కూడా శిక్షణ పొందుతున్నారంటే అవి ఎంతలా ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రోజంతా కోచింగ్ తీసుకొనే అభ్యర్థులు ఆకలితో ఉండకూడదన్న మానవతా దృక్పథంతో అనేకచోట్ల కోచింగ్తోపాటు భోజనం, స్నాక్స్, చాయ్లు అందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం కొన్నిచోట్ల నివాస సదుపాయం కూడా కల్పించటం విశేషం.
ప్రతి కోచింగ్ సెంటర్లో స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు. మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తదితరులు వారి నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాల పరిధిలో అనేక కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. సెంటర్లు పెట్టి వదిలేయకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శిక్షణ ఉత్తమంగా కొనసాగేలా చర్యలు తీసుకొంటున్నారు. హుజూర్నగర్లో ఎన్నారై నర్సిరెడ్డి, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు కూడా ఉచిత శిక్షణ అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తన నియోజకర్గంలోని ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్కు చేరుకోవటానికి బస్పాస్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ప్రభుత్వ స్వయంగా బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లలో వందలమందికి కోచింగ్ ఇప్పిస్తున్నది.
బాధ్యతలేని ప్రతిపక్షాలు
ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టినా అపశకునం పలికేందుకు సిద్ధంగా ఉండే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు, ఉద్యోగాల భర్తీలోనూ అదే తీరు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ ఎంతో బాధ్యతతో సకల సౌకర్యాలతో ఉచిత శిక్షణ ఇప్పిస్తుంటే.. విపక్షాలు కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. నోటిఫికేషన్లు రాకముందు నిరుద్యోగ జంగ్ సైరన్లు ఊదిన విపక్షాలు, తీరా ఒకేసారి భారీ మొత్తంలో నోటిఫికేషన్లు వస్తుండటంతో చల్లగా చాటుకు జారుకొన్నాయి. కనీసం ఒక్క పేద నిరుద్యోగిని ఆదుకొన్న దాఖలాలు లేవు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అధికారంలోకి వచ్చాక అదిచేస్తాం.. ఇది చేస్తాం అని బీరాలు పలకటం తప్ప ఇప్పుడు ఏ రకంగా సాయం చేస్తారో చెప్పటంలేదని ఉద్యోగార్థులు మండిపడుతున్నారు. ఈ పోస్టులన్నీ భర్తీచేస్తే తమకు పుట్టగతులు ఉండవన్న భయంతో నోటిఫికేషన్లను ఆపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి విమర్శించారు.