పేద ప్రజలందరికీ పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్లను ఏర్పాటు చేయగా, బుధవారం 12 జిల్లాల్లో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు రక్త, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్ తదితర 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాకేంద్రాల్లో అధునాతన డయాగ్నస్టిక్ సెంటర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నదని మంత్రులు పేర్కొన్నారు.
విద్యానగర్, జూన్ 9: పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో డయాగ్నస్టిక్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పేదలపై ఆర్థిక భారం పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వీటిని ఏర్పాటు చేశారని, ఇందులో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని వివరించారు. రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.