రైతుల శాపం ఊరికే పోదు..
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి నూకలు చెల్లాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం విషయంలో మొండికేస్తూ రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వానికి పాడె కడుదామని పిలుపునిచ్చారు. రైతుల శాపం ఊరికే పోదని అన్నారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ కాలం చెల్లే సమయం వచ్చినందువల్లే కేంద్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ పంట పండినా కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంచేశారు. రైతులు వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారు?
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యనన్న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కాలగర్భంలో కలిసిపోయారు. వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ సమాజాన్ని కించపర్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు, బీజేపీకీ అదే గతి పడుతుంది. బీజేపీకి తెలంగాణ ప్రజల ఉసురు తప్పక తగులుతది. సీఎం కేసీఆర్ నుంచి రైతులను వేరు చేసేందుకు బీజేపీ కావాలనే వడ్ల విషయంలో రాజకీయ కుట్రకు పాల్పడుతున్నది. కానీ, కేసీఆర్ నుంచి రైతులను ఎవరూ వేరుచేయలేరు. ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దద్దమ్మలు. బండి సంజయ్ ఓ గాడిద.
– నిజామాబాద్ మహాధర్నాలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.
కేంద్రం వడ్లు కొంటామని ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తాం. తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన బీజేపీకి ఇక నూకలు చెల్లాయి. వరి వేయాలని రైతులకు చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారు? తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి వడ్లు కొనిపించాలి. పంజాబ్లో ఎలాగైతే మొత్తం పంటను కొంటున్నారో, తెలంగాణలో పండిన ధాన్యాన్ని కూడా మొత్తం కేంద్రమే తీసుకోవాలి.
– నిర్మల్ మహాధర్నాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
బీజేపీ నేతల నాలుకకు నరం లేదు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సిగ్గున్న వ్యక్తులెవరూ మాట తప్పరు. ఆరు నూరైనా కేంద్రం వడ్లు కొనేవరకు వదిలిపెట్టం. బీజేపీ మోసానికి రైతులను బలి కానివ్వం. తెలంగాణ రైతుల మాదిరే దేశంలోని కర్షకులంతా బాగుపడాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, బీజేపీ నాయకులు కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. ప్రచారం కోసం మతాన్ని, గుడిని, సైన్యాన్ని, సినిమాను కూడా వాడుకొనేందుకు బీజేపీ వెనుకాడదు.
– మహబూబ్నగర్ మహా ధర్నాలో మంత్రి శ్రీనివాస్గౌడ్
యాసంగిలో పండించిన ధ్యాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులను కేంద్రం ఏడిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ అన్నపూర్ణగా మారితే, సీఎంపై కక్ష సాధించాలని బీజేపీ చూస్తున్నది. రైతులను ఏడిపించిన బీజేపీకి త్వరలో తగిన శాస్తి జరుగుతుంది. పండిన ప్రతి గింజనూ కొంటామని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పుడు ఎక్కడ పోయారు?
– ఖమ్మం మహాధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్
తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని చూసి కేంద్రంలోని బీజేపీకి కండ్లు మండుతున్నయ్. అందుకే కుట్రలు చేస్తున్నది. సస్యశ్యామలమవుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక యాసంగి వడ్లను కొనబోమని మెలిక పెట్టింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒకలా, ఇతర రాష్ర్టాల్లో మరోలా వ్యవహరిస్తున్నది. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకొంటాం. – జగిత్యాల మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్ర రైతులతో కేంద్రం, బీజేపీ దొంగాట ఆడుతున్నాయి. రాష్ట్ర రైతుల గొంతునులిమే కుట్రలకు కేంద్రం తెరలేపింది. రైతులు వరి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న సమయంలో మోదీ సర్కార్ రాష్ట్రంపై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ముఖం చాటేస్తే బాధ్యత కలిగిన సీఎం కేసీఆర్ రైతుల పక్షాన పోరాటానికి దిగారు.
–విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి