అశ్వారావుపేట, మే 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు సోమాని శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. స్నేహితుడి బర్త్డే సందర్భంగా తోటి మిత్రులతో కలిసి రాత్రి 10 గంటల సమయంలో పట్టణ శివారులోని ఓ దాబాకు వెళ్లాడు.
అర్ధరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత దాబా నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చాడు. శ్రీనివాసరావు ఎంతకీ లోపలికి రాకపోవడంతో మిత్రులు అతడి ఫోన్ నంబర్కు కాల్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించారు. శనివారం ఉదయం పట్టణ శివారులోని రహదారి పక్కన స్థానికులు శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకొన్న ఎస్సై చల్లా అరుణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. శ్రీనివాసరావు మృతదేహంపై గాయాలను గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు.