యాదాద్రి భువనగిరి : దళితబంధును అడ్డుకున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను అడుగడుగునా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్టలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. దళితబంధును అడ్డుకున్నప్పటికీ, ఇంకెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుంది. దళితబంధు కొత్త పథకం కాదు. దళితబంధును ఏడాది క్రితమే అమలైంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కుట్రను హుజూరాబాద్ ప్రజలు గమనించాలి అని చెప్పారు. ఎన్నికల పేరుతో దళితబంధును కేంద్రం నిలిపివేయడం సరైంది కాదు. దళితబందు అనేది కొనసాగింపు పథకం. అన్ని వర్గాల వారికి దళితబంధు తరహాలో పథకాలు రాబోతున్నాయి. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం కోసం పరితపించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు.