హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై ఢిల్లీ దీక్ష కేంద్రంలోని బీజేపీ సర్కారు భవిష్యత్తుకు గట్టి హెచ్చరిక అని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దీక్షతో కేంద్రం దిగిరాకుంటే ఆ తర్వాత పోరాటం మరో స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. రైతులు నష్టపోవద్దని పరితపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే కేంద్రానికి అన్నిరకాలుగా చెప్పిచూసిందని.. ఇక ఓపిక పట్టేది లేదని తెగేసి చెప్తున్నాయి. ‘ధాన్యం కొనిపించుడో.. బీజేపీని గద్దె దించుడో’ ఏదో ఒకటి జరుగుతుందని స్పష్టంచేస్తున్నాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్ర నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం మొత్తం సోమవారం ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేయనున్నది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రప్రభుత్వమూ రైతుల కోసం ఢిల్లీలో దీక్ష చేసిన దాఖలాలు లేవని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వం మొత్తం కదిలివచ్చి పోరాటానికి కూర్చుంటున్నదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవాలని, లేదంటే బీజేపీకి సర్కారుకు నూకలు చెల్లేలా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఏ రాష్ట్రమైనా ఇలాంటి ధర్నా చేసిందా?
గత ఎనిమిదేండ్లు నానా కష్టాలు పడి రాష్ట్రప్రభుత్వం రైతును రాజును చేసింది. ఇప్పుడు రాష్ట్రం పుష్కలమైన పంటలతో కళకళలాడుతున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్రం పక్షపాత బుద్ధితో, స్వార్థ రాజకీయాలతో రైతన్నను మళ్లీ బికారిని చేసేలా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు విమర్శించారు. ‘ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేసిందా? ఎప్పుడైనా ఇంతమంది ఒక ప్రభుత్వం తరఫున కదలి వచ్చారా? తెలంగాణ ప్రభుత్వం మొత్తం దేశ రాజధానికి కదిలివచ్చి ధర్నా చేస్తున్నదంటే ఆ అంశం ఎంత కీలకమైనదో కేంద్రానికి అర్థమైతలేదా?’ అని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక అంశాన్ని గట్టిగా పట్టుకున్నదంటే అందులో ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనం తప్పకుండా ఉంటుందని, ఆషామాషీగా విషయాలను ప్రభుత్వాలు పెద్దవిగా చేయవని మరో నేత అన్నారు. 70 లక్షల మంది రైతుల భవిష్యత్కు సంబంధించిన అంశం కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశాన్ని ఇంత సీరియస్గా తీసుకొన్నదని తెలిపారు.
బాయిల్డ్ రైస్ కావాలన్నది కేంద్రమే
2013 వరకు ఎఫ్సీఐ ద్వారా రాష్ట్రం నుంచి కేంద్రం ఎక్కువగా రా రైస్ తీసుకొనేది. కానీ కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాయిల్డ్ రైస్ను ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బాయిల్డ్ మిల్లులు ఎక్కువగా లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టుబడిలో 15 శాతం రాయితీ ఇచ్చి మరీ బాయిల్డ్ మిల్లులను ప్రోత్సహించింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు బాయిల్డ్ రైస్ తీసుకొన్నది. ఇప్పుడు ఉన్నట్టుండి బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు నిరాకరిస్తే రైతుల పరిస్థితి ఏమిటని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఒకప్పుడు బాయిల్డ్ రైస్ అడిగి తీసుకున్నదీ కేంద్రమే.. బాయిల్డ్ మిల్లులను ప్రోత్సహించిందీ కేంద్రమే.. ఇప్పుడు బాయిల్డ్ రైస్ వద్దంటున్నదీ కేంద్రమే. ఇలా ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకొంటే జరిగే నష్టాన్ని ఎవరు భరించాలని నిలదీస్తున్నారు. బియ్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా ఆ నెపాన్ని రాష్ట్రంపై నెట్టాలని కేంద్రం చూస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ కండ్లు తెరిచి సమస్యను అర్థంచేసుకోవాలని సూచిస్తున్నారు.