కోడేరు, ఫిబ్రవరి 9 : రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది. యాసంగిలో ఏడెకరాల్లో వరి.. మిగిలిన దాంట్లో మామిడి తోట సాగు చేశాడు. వరి పంటకు యూరియా అవసరం కాగా.. కోండ్రావుపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్దకు సోమవారం వెళ్లాడు. అక్కడ స్మార్ట్ ఫోన్లలో యాప్ ద్వారా యూరియాను రైతులు బుకింగ్ చేస్తున్నారు. తనది ఫీచర్ ఫోన్ కావడంతో బుక్ చేయడానికి అవకాశంలేదని అక్కడి సిబ్బంది సూచించారు. దీంతో రైతు తప్పని పరిస్థితిలో రూ.14 వేలు అప్పు చేసి స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేశాడు.
ఈ సందర్భం గా రైతు మాట్లాడు తూ.. గతంలో యూరియా అవసరం ఉన్న రైతు లు పట్టా పాస్బుక్కు, ఆధార్ జిరాక్స్ ఇస్తే అవసరం ఉన్నంత యూరియా ఇచ్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడంతో యూరియా బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడ్తున్నారని వాపోయారు. ఆన్లైన్ విధానంతో రైతులకు తీవ్రనష్టం జరుగుతున్నదని, తనలాంటి చదువురాని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు.