ఆదివాసీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో ముందున్నది. ఇతర రాష్ర్టాల్లో ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.
– రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిదా అయ్యారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ర్టాలు అనుసరించాలని ఆకాంక్షిం చారు. గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివాసీ సమూహాల (పీవీటీజీఎస్)కు చెందిన విద్యార్థులు, ప్రతినిధులతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పీవీటీజీఎస్ అభ్యున్నతి కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు.
పీవీటీజీస్ ప్రతినిధులు, విద్యార్థులతో రాష్ట్రపతి స్వయం గా మాట్లాడి వారికి అందుతున్న విద్య, వైద్యం, సాగు, తాగు నీరు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో పీవీటీజీఎస్ కోసం చేపట్టిన కార్యక్రమాలు, వాటి వల్ల కలిగిన ప్రయోజనం తదితర అంశాలపై గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ పూర్తికాగానే రాష్ట్రపతి వేదిక మీది నుంచి ఆదివాసీల మధ్యలోకి మైక్పట్టుకొని వచ్చారు.
స్వయంగా ఆరాతీసిన రాష్ట్రపతి
ఇక్కడున్నవాళ్లంతా పీవీటీజీఎస్లేనా? అని రాష్ట్రపతి ఆరాతీశారు. 8 మందితో స్వయంగా మాట్లాడారు. పేరు, తెగ, ఊరు, ఏం చేస్తుంటారు? అధికారులు చెప్పింది నిజమేనా? మంచినీటి సమస్య పరిష్కారం అయిందా? విద్య అందుబాటులో ఉన్నదా? ప్రభుత్వం సౌకర్యాలు అందిస్తున్నదా? స్కూల్స్ ఎలా ఉన్నాయి? పౌష్టికాహారం అందుతున్నదా? వంటి ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకు అక్కడున్నవారు సమాధానం చెప్పడంతో రాష్ట్రపతి ఆశ్చర్యపోయారు.
ఐఐటీమే పడ్ రహేహో బహుత్ అచ్చా..
అడవి తల్లి ఒడిలోఉండే ఆదిమతెగల చిన్నారులకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నిట్ వంటి విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించటంపై ‘గుడ్.. వెరీగుడ్.. అచ్చా అచ్చా.. ఐఐటీమే పడ్రే బహుత్ అచ్చా..’ అంటూ అభినందించారు. అటవీ గ్రామాల్లో విద్యుత్తు సేవలు అందించటం గురించి ఆసక్తిగా విన్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం తెలంగాణ మిగతా రాష్ర్టాలతో పోలిస్తే ఎంతో ముందున్నదని, ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయా తెగల వారితో రాష్ట్రపతి గ్రూప్ఫొటో దిగారు. తొటి తెగకు చెందిన వెడ్మ మెం గూ ‘కీత్రీ’ పేయింటింగ్ను రాష్ట్రపతికి బహుమతిగా అందజేశారు. శుక్రవారం పర్యటన ముగించుకొని రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాష్ట్రపతి ప్రశంస రాష్ర్టానికి గర్వకారణం: మంత్రి సత్యవతి
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర పభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రశంసించడం రాష్ర్టానికే గర్వకారణం. గిరిజన బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ ప్రారంభించిన పథకాలు మిగతా రాష్ర్టాల్లో చేపట్టాలని రాష్ట్రపతి ఆకాంక్షించడం మరిచిపోలేనిది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శం అయినట్టే గిరిజనాభివృద్ధిలోనూ అయ్యింది.
నేడే గుట్టకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
యాదాద్రి, డిసెంబర్29: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సందర్శించనున్నారు. ఉదయం 9.50 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.