Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథాతథంగా ముందుకు సాగనుంది. ఉపాధ్యాయ బదిలీలకు కీలక అడ్డంకిగా మారిన రెండు సమస్యలు మంగళవారం పరిష్కారమయ్యాయి. దీంతో రెండు రోజులు ఆలస్యంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముందుకు సాగనుంది. గురువారం తర్వాత గెజిటెడ్ హెచ్ఎం బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది. బదిలీ కోసం టీచర్ల నుంచి 81,069 దరఖాస్తులు వచ్చాయి. వాటిని జిల్లాలు, మల్టీజోన్ల ప్రకారం అధికారులు వడపోశారు. దీంతో 10వేల వరకు టీచర్లకు పదోన్నతులు లభించనుండగా, 50 వేలకు పైగా టీచర్లకు స్థానచలనం కలగనుంది. నిజానికి బదిలీల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. కటాఫ్ తేదీపై ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. విద్యాశాఖ అ ధికారులు పటిష్టమైన వాదనలు వినిపించడంతో సమస్య పరిష్కారమైంది. కోర్టు ఆదేశాల మేరకు కటాఫ్ తేదీకి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని ఇందుకు రెండు రోజుల గడువు కావాలని అధికారులు కోరారు. ఇందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.
బదిలీలకు అడ్డంకిగా ఉన్న మరో కేసు కూడా మంగళవారం పరిష్కారమైంది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లలో కొంతమంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. సెక్టార్ ఆఫీసర్స్గా 8 మంది విధులు నిర్వహిస్తున్నారు. తాము వెంటనే బదిలీ అయినా తర్వాత విధుల్లో చేరలేమని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. వీరి విధులు అక్టోబర్ 4 తర్వాత ముగియనున్నాయని, ఎన్నికల విధులు ముగించుకున్న తర్వాత వీరు బదిలీ అయిన చోట విధుల్లో చేరవచ్చని విద్యాశాఖ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను సమర్థించడంతో ఈ సమస్య పరిష్కారమయ్యింది.
కటాఫ్ తేదీని ఖరారు చేసూ ప్రభుత్వం జీవో జారీచేయాల్సిన నేపథ్యంలో గెజిటెడ్ హెచ్ఎంల బదిలీ ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంకానుంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మంగళ, బుధవారాల్లో బదిలీలకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశముండగా, ఈ ప్రక్రియ గురువారం తర్వాత నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గతంలోనే బదిలీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తికాగా, తుది సీనియారిటీ జాబితాలను మంగళవారం వెబ్సైట్లలో పొందుపరిచారు. బదిలీలకు వెబ్ ఆప్షన్లులివ్వడం, ఎడిట్ చేసుకోవడం, ఆన్లైన్లో బదిలీ ఉత్తర్వులు జారీకావడమే మిగిలి ఉండగా, కోర్టు కేసుతో కాస్త ఆలస్యంకానుంది. ఈ ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంకానుండగా, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంగా పదోన్నతులు కల్పిస్తారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టి, సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించి, బదిలీలు చేపడుతారు. ఈ ప్రకియంతా ఆన్లైన్లోనే కొనసాగనుంది.