హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన తొలిమెట్టు ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని 23,179 సర్కారీ బడుల్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో తరగతుల వారీగా సాధించాల్సిన విద్యాప్రమాణాలను ఎస్సీఈఆర్టీ అధికారులు రూపొందించారు. 1, 2వ తరగతులకు నాలుగు విద్యాప్రమాణాలు, 3,4, 5వ తరగతులకు ఆరు విద్యాప్రమాణాలను లక్ష్యంగా విధించారు. వీటిని పిల్లలు సాధించేలా ఏడాదిపాటు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. 140 రోజులపాటు తొలిమెట్టు అమలు చేయనున్నారు.
తొలిమెట్టు కార్యక్రమంలో టీచర్ల పాత్ర ముఖ్యమైనది. అందుకే టీచర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చారు. జూలై 30 నుంచి ఆగస్టు 2 వరకు మొదటి విడత, ఆగస్టు 3 నుంచి 6 వరకు రెండో విడత, ఆగస్టు 8 నుంచి 11 వరకు మూడో విడత శిక్షణను పూర్తి చేశారు.