‘కరోనా వల్ల చేసేందుకు పని దొరుకలేదు. ఖర్చులు తీరేందుకు వేరే మార్గం కనిపించలేదు’ దోపిడీ కేసులో పట్టుబడ్డ ఓ దొంగ వాంగ్మూలం.
‘కరోనా కారణంగా ఉపాధి పోయింది. పొట్ట నింపుకొనేందుకు తప్పలేదు’ చోరీకి యత్నించి పట్టుబడ్డ మరో నిందితుడి సమాధానం.
ఇలా చాలా దొంగతనాలు, చోరీ యత్నం కేసుల్లో నిందితుల వాంగ్మూలాల్లో కరోనానే కారణంగా కనిపిస్తున్నది. కనిపించని వైరస్ తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఎంతోమందిని దొంగలుగా మారుస్తున్నది. ఏటీఎం కేంద్రాలు, ఫైనాన్స్ సంస్థలే లక్ష్యంగా జరుగుతున్న చోరీల వెనుక వైరస్ విజృంభణే ప్రధాన కారణ మవుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా పెద్ద కష్టమే తెచ్చింది. 16 నెలలుగా తన పంజాతో ఆరోగ్యపరంగానే కాదు, చాలామందిని ఆర్థికంగానూ దెబ్బతీస్తున్నది. కోట్ల మంది పనులు దొరకక డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆర్థిక కష్టాలు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు నేరాలబాట పడతున్నారు. తక్షణమే డబ్బు దోచేందుకు ఏటీఎం సెంటర్లు, ఫైనాన్స్ సంస్థలనే లక్ష్యంగా ఎంచుకొంటున్నారు. మరికొందరు చైన్స్నాచింగ్లకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్తున్నారు.
ఇక మందుబాబులు మద్యం ఎక్కువై డబ్బు కోసం ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మత్తులో ఏటీఎం సెంటర్లలోకి వెళ్లి రాళ్లతో మెషిన్ను కొట్టడం, మానిటర్ను బండరాయితో బాదడం, తెరుచుకోకపోతే అందులోనే మూత్రవిసర్జన చేయడం వంటి విచిత్ర ఛేష్టలకు దిగి చివరకు పోలీసులకు చిక్కుతున్న ఘటనలు నగరంలో చాలా నమోదయ్యాయి. మరికొందరు రాత్రిళ్లు నిర్మానుష్యంగా ఉండే ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేస్తున్నారు. ఒంటరిగా డబ్బు డ్రా చేసుకుని వెళ్లేవారిపై దాడి చేసి డబ్బు, మొబైల్ ఫోన్లను దోపిడీ చేస్తున్న సంఘటనలు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్నాయి.