కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని: సింగరేణి కార్మికుల ఆదాయంపై పన్ను రూ.800 కోట్లు, సంస్థ ఆదాయంపై పన్ను రూ.400 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ మరో రూ.100 కోట్లు.. మొత్తం రూ.4,300 కోట్లు. ఒక ఏడాదికి కేంద్రానికి భారీగా కప్పం కడుతున్న బంగారు బాతు సింగరేణిని ఎవరైనా వదులుకొంటారా? కానీ, బీజేపీ సర్కారు మాత్రం గనులను ప్రైవేటీకరిస్తూ సింగరేణి ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నది. సుమారు 42 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణిని ఆస్థాన వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు బలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. భూగర్భగనుల్లోకి వెళ్తే తిరిగొస్తామనే భరోసా లేకపోయినా.. ప్రాణాలకు తెగించి బొగ్గు తొలిచి బంగారు పంట పండిస్తున్న కార్మికుల కనీస డిమాండ్లు నెరవేర్చటం లేదు. బీజేపీ సర్కారు వికృత క్రీడపై కార్మిక లోకం భగ్గుమంటున్నది. శనివారం రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలిపి గట్టిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని నిర్ణయించిన మోదీ సర్కారు, నాలుగు సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించింది. కోయాగూడెం బొగ్గు బ్లాకును అరబిందో ఫార్మా కంపెనీకి కట్టబెట్టగా, మిగతా 3 బ్లాకులకు టెండర్లు దాఖలవక పెండింగ్లో ఉన్నాయి ఎన్ని బ్లాక్లు ఇచ్చినా ఉత్పత్తిచేయగల సామర్థ్యం ఉన్న సింగరేణికి ఉన్నప్పటికీ.. కేంద్రం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నది. 2025నాటికి ప్రభుత్వరంగ సంస్థల్లో రూ.ఆరు లక్షల కోట్ల విలువైన వాటాలను అమ్మాలని నిర్ణయించినట్టు స్వయంగా కేంద్రఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఈ కుట్రలో సింగరేణి కూడా భాగమేనని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భిన్నంగా భూగర్భంలోకి వెళ్లి బొగ్గు వెలికితీస్తున్న కార్మికులను, దేశ సైనికుల మాదిరిగా గుర్తించి ఆదాయ పన్ను రద్దు చేయాలనే డిమాండ్ ఎన్నో ఏండ్లుగా ఉన్నది. 2014లో సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎనిమిదేండ్లయినా కేంద్రం నుంచి స్పందన లేదు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నది. సింగరేణిపై కేంద్రం కుట్రలను తొలినాళ్లలోనే గమనించిన ముఖ్యమంత్రి, కేంద్రం వాటా 49 శాతం కొనుగోలుకు సిద్ధమని లేఖరాసినా నేటికీ సమాధానం లేదు. 11వ వేతన ఒప్పందంలో ఆశించినట్టుగా వేతనాలు పెరగకుంటే ఆందోళనలు తప్పవని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
గతంలో పెన్షన్ ఫండ్కు కార్మికుల వేతనాల నుంచి 3.16 శాతం వసూలు చేసే యాజమాన్యం, ఇప్పుడు 7 శాతం మొత్తాన్ని కార్మికుల జీతాల నుంచి వసూలు చేస్తున్నది. ఉత్పత్తయ్యే బొగ్గు టన్నుకు రూ.10 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో వందల కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కు చేరుతాయి. అయినప్పటికీ పెన్షన్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. 20 ఏండ్ల కిందట నిర్ణయించినట్టుగా బేసిక్పై 25 శాతమే పెన్షన్ చెల్లిస్తున్నారు. పెన్షన్ పెంపుపై మోదీ మౌనంగా ఉండటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం 42 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా అమలుకు సిద్ధమవటంపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ఇవి అమల్లోకి వస్తే డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలు, అందోళనలు, సమ్మెలను నిషేధించే విధానాలపై టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలు అందోళనలకు సిద్ధమవుతున్నాయి. పదవీ విరమణ వయస్సును 61కి పెంచగా పెన్షన్, సీఎంపీఎఫ్ అమలు చేయలేమని కేంద్రం పేర్కొనటంపై కార్మికవర్గం తీవ్ర అగ్రహం వ్యక్తంచేస్తున్నది.
మోదీ ప్రభుత్వం సింగరేణి నుంచి ఏటా రూ.4వేల కోట్లకుపైగా ఆదాయం పొందుతున్నది. కార్మికుల డిమాండ్లపై స్పందించడం లేదు. గత ఎనిమిదేండ్లలో సింగరేణి నుంచి దాదాపు రూ.23 వేల కోట్ల వరకు ఆదాయం కేంద్ర ఖజానాకు చేరింది. అందులో నుంచి మోదీ ఒక్క రూపాయి కూడా కార్మికులకు ఖర్చుచేయలేదు. ఆదాయపు పన్ను రద్దు చేయని మోదీకి కార్మికులు గుణపాఠం చెప్పాలి. కార్మిక సంఘాలు ఐక్యంగా మోదీ పర్యటనను అడ్డుకోవాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి