హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో ఇటీవల బజారుకెక్కిన విభేదాలను ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. అందరినీ కలుపుకొని వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలే నేతల మధ్య విభేదాలకు కారణమని ఈ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది. పార్టీ సీనియర్లంతా రేవంత్రెడ్డి వైఖరిని తప్పుపట్టడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను మందలించిందని ఆ పార్టీ వర్గాల సమాచారం. బుధవారం సాయంత్రం నాలుగు గంటల పాటు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీచేసిన షోకాజ్ నోటీసులపై వాడివేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. రేవంత్రెడ్డి కనుసన్నలలోనే క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలు ఉన్నాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కమ్ ఠాగూర్కు పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని సమాచారం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను అయినా కనీసం సమాచారం ఇవ్వకుండా తన జిల్లాలో రచ్చబండ ఏర్పాటు చేయటం ఎంతవరకు సమంజసమని జగ్గారెడ్డి నిలదీశారు. ఇదే విషయాన్ని తాను ప్రశ్నిస్తే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని, తప్పును తప్పని చెప్తే ఇబ్బందికరంగా ఉంటే పార్టీని వదిలిపెట్టి వెళ్లేందుకూ సిద్ధమేనని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి అడిగిన దాంట్లో తప్పేమి లేదని, ఏకపక్షంగా ఆయనకు నోటీసు ఎలా ఇస్తారని సీనియర్ నేతలంతా ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీని వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాలపై పార్టీ వేదికలపై మాట్లాడితే బాగుంటుందని సీనియర్ నాయకులు జానారెడ్డి, శ్రీధర్బాబు హితవు పలికారని తెలిసింది. ‘నాది తప్పే. మరి పార్టీ జాతీయ నాయకుడు శశిథరూర్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆయనకు ఎందుకు నోటీసు జారీ చేయలేదు’ అని జగ్గారెడ్డి నిలదీసినట్టు తెలిసింది. ‘పార్టీ కార్యాచరణపై చర్చిస్తే బాగుంటుంది. ఇక్కడ మనం కొట్టుకుచస్తుంటే అక్కడ బీజేపీ దూసుకుపోతున్నది’ అని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ సూచించినట్టు తెలిసింది. టీపీసీసీ నేతలెవరైనా తనకు, సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖలు రాయవచ్చని, వాటిపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మాణిక్కమ్ ఠాగూర్ సూచించినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి హితవు చెప్పినట్టు సమాచారం.