Congress | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల ఖరారు అగ్గి రాజేస్తున్నది. పార్టీలో ఉన్నవాళ్లను పక్కనబెట్టి బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేకు లేఖ రాసి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఖర్గేకు సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ రాయటం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. నిరంజన్ లేఖ రాయటాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ ఖండించడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది. దీంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అసలేం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ఐదుగురి పేర్లు ప్రకటించగా, అందులో నలుగురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిచేరిన వారే.
చేవె ళ్ల టికెట్ దక్కించుకున్న రంజిత్రెడ్డి, మల్కాజిగిరి టికెట్ దక్కించుకున్న సునీతామహేందర్రెడ్డి, సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్న దానం నాగేందర్, పెద్దపల్లి టికెట్ దక్కించుకున్న గడ్డం వంశీకృష్ణ ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లే. మల్లు రవి మాత్రమే పార్టీ సీనియర్ నేత. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిరంజన్.. శుక్రవారం ఖర్గేకు లేఖ రాశారు. ప్రజలకు బీఆర్ఎస్ పాలన నచ్చకనే కాంగ్రెస్కు పట్టం కడితే, మరి అదే పార్టీకి చెందిన వారిని చేర్చుకొని టికెట్లు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి? అని లేఖలో నిలదీశారు. బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వటమంటే పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని చెప్పకనే చెప్పినట్టు కాదా? అని ప్రశ్నించారు.
మహబూబ్నగర్ సభలో ‘కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. వారు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, కేసులు, జైలుశిక్షలను ఎదుర్కొని చేసిన త్యాగాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం ది’ అని రేవంత్రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తుచేసిన నిరంజన్.. కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటామంటే ఇదేనా? అని నిలదీశారు. ‘జలగం వెంగళరా వు హయాంలో సిద్దిపేట నుంచి సామాన్య కార్యకర్త నంది ఎల్లయ్యకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాం. మర్రి చెన్నారెడ్డి హ యాంలో సాధారణ ఉద్యోగి మల్లు అనంతరాములు (మల్లు రవి, భట్టి విక్రమార్క సోదరుడు)ను నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా గెలిపించాం. నాడు సాధారణ వ్యక్తులకు టికెట్ ఇస్తే, ఇప్పుడు వలస నేతలకు టికెట్లు ఇచ్చా రు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. లేఖ విషయం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. అయితే, నిరంజన్ లేఖ రాయటాన్ని మీడియా సమావేశంలో మహేశ్కుమార్గౌడ్ ఖండించడం, లేఖ రాయడం తగదని అనడం పార్టీలో విభేదాలను ఎత్తిచూపినట్టయ్యింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.