‘గుడ్డి గేదెల్లో గూని గేదె శ్రీమహాలక్ష్మి’ అని పెద్దల ఉవాచ. అవును మిగిలినవన్నీ గుడ్డి గేద్లైనపుడు గూని గేదెకే చెలామణి ఉంటుంది. అదంత గొప్పదని కాదు.. మిగిలినవి ఆ మాత్రం కూడా పనికిరాకపోవటం.. అంతే! రాజకీయాల్లో కొన్ని పార్టీలదీ ఇలాంటి వ్యవహారమే. సీనియారిటీ ఉన్నా.. సమర్థత ఉన్నా.. దాన్ని తగిన సమయంలో తగినవిధంగా వాడుకొని తమను తాము ప్రూవ్ చేసుకోలేకపోతే, ప్రజల మనసు తెలియక అడ్డం దిడ్డం పనులు చేసి ఉన్న క్రెడిబిలిటీని ఊడగొట్టుకుంటే.. రాత్రికి రాత్రి హెలికాప్టర్ నాయకులు దిగి నెత్తి మీద పెత్తనం చేస్తారు. అప్పుడు మిగిలేది.. నోట్లో వేలేసుకొని చోద్యం చూడటమే.. అవును ఇది తెలంగాణ కాంగ్రెస్ కథే!
2021 జూలై నెలలో అనుకుంటా.. ఓ జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాయకుడు ఆశీర్వాదం కోసం బాబుగారి బాజా మీడియా అధినేత ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. దేని మీద? ఈయన తాను పదవీ స్వీకారం చేసిన పార్టీ మీదా మాట్లాడలేదు. ఆయన ఈ పార్టీ ఎదుగుదలకు సూచనా ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి పాపం చంద్రబాబు గారి పరిస్థితి.. ఆయన ముద్దుల బాబుగారి పరిస్థితి మీద ముచ్చటించుకున్నారు. బాబు గారి పుత్రరత్నానికి ఏం చేసినా మైలేజీ రావడం లేదని మీడియా అధినేత తెగ బాధపడి పోతున్నాడు. కవరేజీ ఇవ్వడంలేదని ఇతర మీడియాను బండబూతులు తిడుతున్నాడు. ఈయనేమో.. ‘గట్టిగా ప్రజల్లో తిప్పాలన్నా.. గ్రౌండ్ లెవల్లో ఏదో కార్యక్రమం పెట్టాలి. ఎస్టాబ్లిష్ అవుతాడు.’ సలహా చెప్తున్నాడు. ఆయన పెదవి విరుస్తున్నాడు. అప్పటికి ప్రమాణస్వీకారపు కాళ్లపారాణి కూడా ఆరని ఆ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. బాబుగారి సుపుత్రుని గురించి అంత బాధపడిపోయే మీడియా అధినేత ఎవరో అందరికీ తెలుసు. ఈ సంభాషణ మొత్తం సోషల్ మీడియాకెక్కింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ బలోపేతానికి పాటుపడాల్సిన రేవంత్రెడ్డి చంద్రబాబు కొడుకు గురించి బెంగ పెట్టుకోవడం ఏమిటని కాంగ్రెస్ సీనియర్లు నిప్పులు చెరిగారు. అసలు రేవంత్ను పార్టీ అధ్యక్షుడిని చేసినప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. రేవంత్రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేయడమంటే చంద్రబాబు నాయుడిని పీసీసీ అధ్యక్షుడిని చేయడమే అనే వాదనలు కూడా వినిపించాయి. సరే వాటిని పక్కనపెట్టినా రాష్ట్ర రాజకీయాల్లో నాటినుంచి ఒక కొత్త సమీకరణం అమల్లోకి వచ్చింది. అది బాబు-బంటు వయా బాజా. అంటే బాజా మధ్యవర్తిత్వంతో బంటు ద్వారా బాబు తెలంగాణ రాజకీయాలు నడపడం. ఇవాళైనా, రేపైనా జరిగేది అదే. బాబు ప్రోద్బలంతో ఇప్పటికే ఆ పార్టీలో చేరినవాళ్లు.. రేపు చేరబోతున్నవాళ్లు.. అంతా కలిపి ఓ పాతికమంది ఎమ్మెల్యే అభ్యర్థులు అంతా మాజీ టీడీపీలే ఉంటారని అంచనా!
అసలు రేవంత్ ఎవరు? ఆయన చరిత్ర ఏమిటి? ఎక్కడినుంచి పుట్టుకువచ్చాడు. ఏ తరహా రాజకీయం నడుపుతున్నాడు. ‘మరో ఓబులేసు. మా జిల్లాలో చెడబుట్టాడు..’ అన్నారు ఓ సందర్భంలో మాజీ మంత్రి జూపల్లి. డీఎల్ఎఫ్ కంపెనీ వ్యవహారంలో రేవంత్ చేసిన ఆరోపణల మీద జూపల్లి స్పందన ఇది. ‘నువ్వో ఐటెం సాంగ్ గర్ల్వి. ఇలా వచ్చి అలా పోతుంటావు. పార్టీకి ఏమన్నా లాభం వచ్చిందా? నువ్వు పార్టీతో బాగుపడ్డావు. ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువు తీశావని టీడీపీ సమావేశంలోనే వాయించి పారేశారు ఎర్రబెల్లి ఓసారి. ‘మా పార్టీకి పట్టిన గ్రహణం విడిచింద’ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రాజీనామా మీద స్పందించారు రమణ. ‘రేవంత్కు పదవి వల్ల టీడీపీ బావుకున్నదేమీ లేదు. ఆయన కారణంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. రేవంత్ రాకముందు టీడీపీ 22 శాతం బలం ఉంటే అది ఏడు శాతానికి దిగజారింది, బాబు ముందు ప్రగల్భాలు పలికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దిగి ఒక్క సీటును కూడా గెలిపించలేదని పార్టీ సమావేశాల్లోనే దుమ్ము దులిపారు మోత్కుపల్లి. ‘నీ తండ్రి హంతకుడు. నడిబజార్లో హత్య చేశాడు’ 2010 జూన్ 20న నాటి మంత్రి డీకే అరుణ చేసిన ఆరోపణ ఇది. పేపర్లోనే వచ్చింది. ‘నువ్వేమన్నా తురుమ్కాన్ అనుకుంటున్నవా? కాంగ్రెస్ నీ అబ్బసొత్తా?’ అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘మందిని తెచ్చుకొని సప్పట్లు కొట్టించుకుంటే లీడవ్వి అయిపోతవా?’ అని నిలదీశారు వీహెచ్. ‘జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తితో కలిసి పనిచేయలేను. ఆయన ఒక చీటర్, బ్లాక్ మెయిలర్’ అని పార్టీకి గుడ్బై చేప్పే సమయంలో అన్నారు మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే!.
రేవంత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది టీఆర్ఎస్తో. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పేరు చెప్పుకొని గెలిచాడు. కానీ, జీవితంలో ఏనాడూ తెలంగాణకు ఉపయోగపడింది లేదు కానీ అదే తెలంగాణకు సున్నం పెట్టేందుకు ఏనాడూ వెనుకాడలేదు. పాలమూరు జిల్లాలో ఒక జెడ్పీటీసీగా తెలంగాణవాదం వేదికగా గెలిచాడు. అయితే పార్టీతో ఆయన ప్రయాణం పెద్దగా సాగలేదు. పార్టీ కూడా ఆయన వ్యవహారశైలి చిల్లర రాజకీయాలు చూసి పక్కనపెట్టింది. అక్కడ పెద్ద పదవి ఆశించి అది నెరవేరకపోయేసరికి పార్టీ వదిలేసి టీడీపీతో సంబంధాలు పెంచుకున్నాడు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో టీడీపీ పరోక్ష మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాడు. బాబుతో సంబంధా లు పెంచుకొని తెలంగాణ వాదాన్ని గాలికివదిలేసి సమైక్య బాబు పార్టీలో ఐక్యమైపోయాడు. ఆ తర్వాత ఎన్నడూ తెలంగాణ పేరు ఎత్తింది లేదు. తెలంగాణ కోసం మాట్లాడిందీ లేదు. ఆయన జీవితమంతా బాబు సేవకే అంకితమైపోయింది. అక్కడన్నా సరిగా ఉన్నాడా అంటే అదీ లేదు. జిల్లా నాయకులందరితో యుద్ధాలు. 2009లో ఆయన అదృష్టం బాగుండి మహాకూటమి పొత్తు, కేసీఆర్ స్వయంగా ఎంపీగా పోటీ చేయడంతో ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో ఆయన ఎక్కడా ఏ వేదికను పంచుకున్న దాఖలాల్లేవు..
నేను 2011లో బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ కోసం గవర్నర్ కుర్చీని గుంజేసిన. సస్పెండ్ అయిన అని తన తెలంగాణ వాదానికి సాక్ష్యం చెప్పాడు. అవును గుంజేశారు. ఎందుకు? కేసీఆర్ దీక్షతో తెలంగాణ శివమెత్తింది. తెలంగాణ ప్రకటనా వచ్చింది. రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. తెలంగాణ తీర్మానం చేసిన చంద్రబాబు ఆ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అర్ధరాత్రి ప్రకటించారు. ఎవరినీ సంప్రదించలేదు’ లాంటి సాకులు చెప్పి ఆంధ్రలో ఉద్యమం రాజేశాడు. తెలంగాణ భగ్గుమంది. ఎక్కడ టీడీపీ నాయకులు కన్పించినా తరిమితరిమి కొట్టారు. విధి లేక బాబు రెండు కండ్ల సిద్ధాంతం తెచ్చాడు. తెలంగాణ ఎమ్మెల్యేలను ఉద్యమం చేసుకోమన్నాడు. అందులో భాగమే రేవంత్ కుర్చీ లాగుడు. సభలో హరీశ్ సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంచీలెక్కి నినాదాలు చేస్తుంటే తామెక్కడ వెనకబడిపోతామోనని టీడీపీ వాళ్లూ తలా ఓ నిరసన చేశారు. ఆ నిరసనలో జీవం ఉన్నదా? తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్నదా? అదే ఉన్నట్టయితే తెలంగాణ ప్రకటన ఎలా వ్యతిరేకిస్తాం? అని చంద్రబాబును నిలదీసి ఉండాలి. అప్పుడు లేఖ ఇచ్చి ఇప్పుడు ఈ రెండు కండ్ల సిద్ధాంతమేమిటి? అని కడిగిపారేయాల్సింది. అర్ధరాత్రి ఇస్తే ఏమిటి? తెల్లారాక ఇస్తే ఏమిటి? మనం కూడా తీర్మానం చేశాం కదా అని ఎదురుతిరగాల్సి ఉండేది. అవేవీ చేయకుండా మంది చూసుటానికి గొడవ చేస్తే అది తెలంగాణ వాదమా? విద్యుత్తు చార్జీలు పెంచితే కేసీఆర్ బహిరంగ లేఖ రాసి, స్పందన లేకపోతే పదవికి రాజీనామా మొకాన కొట్టివచ్చాడు. అంతేగాని ఏం చేసినా పదవులు పట్టుకొని వేలాడలే! తెలంగాణ అంటే ఏమిటో తెలంగాణ ప్రజల సమస్యలంటే ఏమిటో తెలిసి ఉన్నవాళ్లు ఎవరన్నా వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అంటారా? ఇదేనా తెలంగాణ మీద ఉన్న అవగాహన. ఇదేనా వ్యవసాయం మీద ఉన్న అవగాహన. తెలంగాణ ఉద్యమం రగిలింది రైతు సమస్యల మీద. రైతుకు కావలిసిన నీటి మీద.. కరెంటు మీద.. అప్పుల మీద.. అవన్నీ తెలిసి ఉన్నవాళ్లు ఎవరన్నా 3 గంటల మాట ఎత్తుతారా?
గమ్మత్తేమిటంటే తాను నికార్సయిన తెలంగాణవాదినని ఆయన ఇటీవల చెప్పుకొన్నాడు. అంతేకాదు, తెలంగాణ తీర్మానం చేయాలని బాబుకు చెప్పింది తానే అంటాడు. ఏదో తెలంగాణ కోసం చెమట చిందించినట్టు రక్తం ధారపోసినట్టు మాట్లాడాడు. ఈయన తెలంగాణవాదం గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఈయన తాను తెలంగాణ వాదినని, తెలంగాణ ఇవ్వాలని చంద్రబాబును ఒప్పించానని చెప్పుకోవడం చూసి నవ్వుకుంటున్నారు. నిజానికి నాడు ఆ డిమాండ్ గట్టిగా వినిపించినవారు దేవేందర్గౌడ్. ఆ తర్వాత నాగం జనార్దన్రెడ్డి. తెలంగాణ పట్ల సానుకూలంగా వ్యవహరించిన వారు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు వంటి సీనియర్లు. నాడు ఓ ఛోటా లీడర్ అయిన రేవంత్ ఆ చుట్టుపక్కలా ఎక్కడా లేడు. అసలాయనను తెలంగాణ గురించి అడిగినవాళ్లూ లేరు. టీడీపీలో ఆ వ్యవహారం అంతా సీనియర్ల చేతిలోనే నడిచింది.
టీడీపీకి సంబంధించినంత వరకు తెలంగాణ అంశంలో ఏనాడూ రేవంత్ ప్రస్తావన కూడా లేదు. చంద్రబాబు టీఆర్ఎస్ పొత్తు కోసం 2008లో తెలంగాణ అంశం పరిశీలనకు ఒక కమిటీ వేశారు. అందులో తెలంగాణకు ప్రాతనిధ్యం వహించింది దేవేందర్గౌడ్. వాస్తవం ఇది అయితే నేను చంద్రబాబును ఒప్పించి తెలంగాణ తీర్మాపం చేయించానంటాడు. అబ్బా.. మరి నాగం ఏం చేసినట్టు? దేవేందర్గౌడ్ ఏం చేసినట్టు? అసలు తీర్మానం చేసింది పాలిట్ బ్యూరోలో. నివేదిక ఇచ్చిన కమిటీలో ఉన్నది దేవేందర్గౌడ్. పొలిట్ బ్యూరోలో ఉన్నది నాగం, దేవేందర్, కడియం. వారి పట్టుదల సలహాతోనే బాబు తెలంగాణకు అనుకూలంగా పాలిట్బ్యూరోలో తీర్మానం చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు.
చిదంబరం తెలంగాణ ప్రకటన తర్వాత టీడీపీలో తెలంగాణ ఫోరం ఏర్పడింది. దానికి తొలుత నాగం నాయకత్వం వహిస్తే ఆ తర్వాత ఎర్రబెల్లి వచ్చారు. అంతే తప్ప రేవంత్ పేరు కూడా చంద్రబాబు ఏనాడూ పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. అలాగే నాటి టీడీపీ ఫోరం సమావేశాల వేదికల మీద ఎప్పుడూ కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి, జోగురామన్న, వేణుగోపాలాచారి, మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, గంగుల కమలాకర్ కనిపిస్తే ఆ సమావేశాల్లో హరీశ్వర్రెడ్డి, కేఎస్ రత్నం, గంప గోవర్ధన్, తీగల కృష్ణారెడ్డి, దయాకర్రెడ్డి, జితేందర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి తదితరులే ప్రముఖంగా కనిపించేవారు. మీడియాలో వారి వాయిస్ మాత్రమే వినిపించేది. మరి ఈ భయంకర తెలంగాణవాది వాయిస్ ఎందుకు వినిపించలేదో ఆయనే చెప్పాలి.
ఆంధ్రా ఎమ్మెల్యేల రాజీనామా కుట్రతో తెలంగాణ వెనక్కిపోయినపుడు పార్టీలకు అతీతంగా కేసీఆర్ జానారెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటుకోసం కళింగభవన్లో సమావేశం జరిగింది. అన్ని పార్టీలనూ ఆహ్వానించారు. ఆ సమావేశానికి టీడీపీనుంచి హాజరైంది సీహెచ్ రాజేశ్వర్రావు, ఎల్ రమణ, పోచారం, రేవూరి, పెద్దిరెడ్డి, చెన్నాడి సుధాకర్రావు మాత్రమే. ఇందులో రేవంత్ లేడు. మరి చంద్రబాబుకే తెలంగాణ తీర్మానం చేయాలని చెప్పిన ఈ ‘సహచరుడి’ని బాబు ఎందుకు ఎంపిక చేయలేదో..మనకు తెలియదు. ఆ తర్వాత జేఏసీ నిర్ణయం మేరకు రాజీనామా లేఖలు పంపిన 36 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో నగేశ్, జోగురామన్న, పోచారం, మండవ, గంప గోవర్ధన్, ఏలేటి అన్నపూర్ణమ్మ, రమణ, హరీశ్వర్రెడ్డి, ఎం కిషన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, కేఎస్ రత్నం, నాగం, రావుల, పీ రాములు, జైపాల్యాదవ్, పట్నం మహేందర్రెడ్డి, వై ఎల్లారెడ్డి, ఉమామాధవ రెడ్డి, ఎమ్మెల్సీలలో బోడకుంటి వెంకటేశ్వర్లు, ఏ నర్సారెడ్డి మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో రేవంత్ పేరు లేదు. ఈ మహా తెలంగాణవాది అప్పుడు ఎందుకు రాజీనామా లేఖ పంపలేదో. రేవంత్ చెప్పుకోవడమే గానీ పార్టీలో నాగం, కడియం, పోచారం, వంటి బలమైన నాయకులు ఉన్నపుడు ఆయనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తర్వాత కాలంలో కడియం, పోచారం, జోగురామన్న, గంపగోవర్ధన్, గంగుల వంటి వారంతా పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరిపోయి పార్టీలో గుప్పెడుమంది మిగిలాకే చంద్రబాబు చేరదీశాడు. ఇది చరిత్ర.. ఎవరూ చెరపలేరు. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే టీడీపీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రజలు తరిమితరిమి కొడుతుంటే.. దౌర్జన్యంగా బలవంతపు సభలు జరుపుతున్న కాలంలో కరీంనగర్కు తుపాకీ పట్టుకొని వెళ్లిన వైనమే రేవంత్ తెలంగాణ వాదం తీరు ఎలాంటిదనేది ప్రజల ముందున్న తిరుగులేని సాక్ష్యం! అలాగే ఎమ్మెల్సీగా ఉన్నపుడు గానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ తెలంగాణ గురించి చట్టసభల్లో ఈయన ఏనాడూ మాట్లాడింది లేదు. పెద్ద నాయకులంతా వెళ్లిపోయాక, కేంద్రం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమయ్యాక తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినపుడు జరిగిన చర్చలో టీడీపీ తరఫున మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు.
ఢిల్లీలో మాట్లాడిన రేవంత్ తాను చంద్రబాబుకు సహచరుడినని కేసీఆర్ గుర్తింపు లేని నాయకుడన్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో అనుచరుడిగా పదవికోసం ఆయన చుట్టూ తిరిగేవాడనీ చెప్పేశాడు. అం టే రాష్ట్రంలో అంత చరిత్ర తెలియని దద్దమ్మలున్నా రా? 1985లో సిద్దిపేట నుంచి గెలిచిన కేసీఆర్ 1987 నాటికే ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేరారు. అం తేకాదు. 1990లో ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాలకు ఆయన పార్టీ కన్వీనర్ కూడా అయ్యారు. 1996 లో చంద్రబాబు క్యాబినెట్లో మరోసారి మంత్రి అయ్యారు. ఆ తర్వాత టర్మ్లోనూ ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన పార్టీలో ఎప్పుడూ కీలకపాత్రే పోషించారు. తప్ప ఏదో అనామకంగా ఉన్నది లేదు. పార్టీకి వేలాది మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసిన శిక్షణ శిబిరాలకు ఆయన ఇన్చార్జ్. ఆయన క్లాస్ మొదలైందంటే తింటున్న అన్నం ప్లేట్లను వదిలేసి కార్యకర్తలే కాదు, నాయకులు కూడా మీటింగ్ హాలు కు పరిగెత్తేవారని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడిగా పనిచేసిన నేరెళ్ల ఆంజనేయులు ఓ సందర్భంలో చెప్పా రు. అదీ కేసీఆర్ స్టామినా. మరి రేవంత్ది ఏ స్టామి నా? జూబ్లీహిల్స్ సొసైటీ అట. అదేమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? అలాంటివి వందలు వేల సొసైటీలున్నాయి హైదరాబాద్లో. దానికో డైరెక్టర్. అదో పెద్ద సీఎం పదవి. అది గెలవడమో ఘనకార్యం.
తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ప్రజలకోసం తాను నికార్సుగా కొట్లాడానంటాడు. అసలాయనకు తెలంగాణ సబ్జెక్టు ఎంత వరకు తెలుసో మనకు తెలియదు. ఆయన ప్రసంగమే చూద్దాం. 1969లో పాల్వంచలో బంట్రోతు ఉద్యోగంలో తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణ ఉద్యమం వచ్చిందట. నవ్వాలో ఏడ్వాలో తెలియదు. బంట్రోతు పోస్టు మీద ఉద్యమం మొదలైంది ఆంధ్రలో. అది 1930 నాటి మాట. కోర్టులో బంట్రోతు పోస్టుకు కుంభకోణం జడ్జి ఒకరు తమిళ వ్యక్తిని నియమిస్తే అక్కడ ఆంధ్రులు ఆందోళన చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని సుదీర్ఘ పోరాటం జరిపారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో అది సిద్ధించింది. ఈ విషయం అనేక సార్లు జయశంకర్ సార్ చెప్పారు. పాపం రేవంత్ అందులోని బంట్రోతు పోస్టును తెలంగాణ ఉద్యమానికి అంటగట్టేశారు. 1968లో ప్రారంభమైన కేటీపీఎస్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్కు వ్యతిరేకంగా తెలంగాణ రక్షణలను కాలరాసి పెద్ద ఎత్తున ఆంధ్రా ఉద్యోగులను నియమించడానికి వ్యతిరేకంగా పాల్వంచ-ఖమ్మం ఉద్యమం జరిగింది. ఉద్యోగాలే కాదు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం తెలంగాణ రక్షణలన్నీ అమలుచేయాలనే డిమాండ్తో రవీంద్రనాథ్ అనే యువకుడు ఆమరణ దీక్ష చేపట్టాడు. ఈ ఉద్యమమే క్రమంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా మారింది. అంతే తప్ప ఒక్క బంట్రోతు పోస్టు కోసమో.. స్వీపర్ పోస్టు కోసమో కాదు.
అంతేకాదు రేవంత్ ఏమంటాడు? 1969 ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఢిల్లీకి తాకడం వల్ల ఇందిరాగాంధీ నేతృత్వంలో తెలంగాణ యువకులకే తెలంగాణ ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకే ఉండాలని జోనల్ వ్యవస్థను ఏర్పరిచి అధికారికంగా చట్టం చేసి ఆర్టికల్ 37/డీ తో రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ ప్రజలకు హక్కు కల్పించారట. అసలీ 37/డీ ఎందువల్ల వచ్చింది? దానివల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరింది? తెలిసే మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడుతున్నాడా? అర్థం కాదు.
ఈ రాజ్యాంగ సవరణ తెచ్చింది 1969లో కాదు, 1973లో! తెలంగాణ ఉద్యమం చూసి కాదు, జై ఆంధ్ర ఉద్యమం చూసి. జరిగిందేమిటి? తెలంగాణ ఉద్యమం వచ్చింది.. పోయింది. తెలంగాణ రక్షణలు పాటిస్తామని దానిమీద ఓ కమిటీని ఇందిర వేశారు. ఇటు టీపీఎస్ కాంగ్రెస్లో విలీనమైంది. అంతే. తెలంగాణ ఉద్యమానికి ప్రతిఫలంగా దక్కింది ఏమిటంటే మూడువందల యువకుల శవాలు.. అంతే. ఆ తర్వాత కాలంలో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ముల్కీరూల్స్ చెల్లుతాయని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం తెలంగాణలో ఆంధ్రులకు ఒక్క పోస్టుకూడా రాదు. చేయడానికి వీల్లేదు. దీనితో ఆంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం పుట్టింది. ఉద్యోగాలు రాకపోతే తెలంగాణతో కలసి ఉండలేమన్నారు కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు ఎన్నికల్లో ఇందిర చేతిలో ఘోరపరాజయం పొంది వీధుల్లో ఉన్న ప్రతిపక్షాలన్నీ ఆంధ్ర మీద పడ్డాయి. అల్లకల్లోలం చేశాయి. చివరికి రాజీమార్గంగా పీవీతో రాజీనామా చేయించి 1973 సెప్టెంబర్ 1న ఆరు సూత్రాల పథకం ప్రకటించారు. అంటే తెలంగాణ ఉద్యోగాల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన పూర్తి హక్కును సమాధి చేశారు. పీవీ స్థానంలో తమకు అవకాశం దక్కుతుందేమోననే ఆశతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా హైదరాబాద్లో సమావేశమై అక్టోబర్ 1న ఆరు సూత్రాల పథకం మీద సంతకాలు చేశారు. దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనిమీద తీవ్రంగా మండిపడ్డ తెలంగాణవాదులు, యువకులు అసెంబ్లీ గేటు వద్ద ఏకంగా పీవీ కారునే అటకాయించి దాడి చేశారు. ఎమ్మెల్యేల చొక్కాలు చించేశారు. అయినా ఇందిర ఆగలేదు. డిసెంబర్ 18న పార్లమెంటు సమావేశంలో సుప్రీం తీర్పు వర్తించకుండా రాజ్యాంగ సవరణ చేసి ఆ తీర్పును నిర్వీర్యం చేశారు. అదే 37/డీ. దాన్ని అమలుచేయడానికి ఇచ్చిందే ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అందులో భాగమే జోనల్ వ్యవస్థ. దీనికింద హైదరాబాద్ ఫ్రీ జోన్ అయింది. హెచ్వోడీలు, పీఎస్యూలు, కార్పొరేషన్లు, బోర్డులు, ఎయిడెడ్ సంస్థల్లో జోనల్ రిజర్వేషన్లు ఎత్తేశారు. 12 సంవత్సరాల లోకల్ నిబంధనను నాలుగేండ్లకు తగ్గించారు. ఉన్న ముల్కీ నిబంధనలు ఊడగొట్టి ఆంధ్రులకు ఇక్కడ అవకాశాలు కల్పించిన ద్రోహం.. ఆ జోనల్ వ్యవస్థ. అసలు చరిత్ర ఇదైతే తెలంగాణ ఉద్యమం వల్ల జోనల్ వ్యవస్థ వచ్చిందని రేవంత్ చెప్తాడు. దానివల్ల తెలంగాణ యువకుల ఉద్యోగాలకు రక్షణ వచ్చిందంటాడు. ఏ జీవో ఎందుకు పుట్టిందో తెలియదు. ఏ ఉద్యమం ఎందుకు జరిగిందో తెలియదు. ఆయన నికార్సయిన తెలంగాణ వాది అట!
ఇక పోతే తాను చంద్రబాబు సహచరుడినని రేవంత్ చెప్పుకున్నాడు.సరే. నోరుంది. నోట్లో నాలికా ఉంది. కాబట్టి ఏమైనా చెప్పుకోవ చ్చు. కానీ అవి వాస్తవాలా కాదా అనేది తెలిసిన వారు బతికే ఉన్నారు కదా? ఎక్కడన్నా సహచరుడంటే వేదికలు పంచుకుంటాడు. వేదికల మీద సీట్లు పంచుకుంటాడు. స్వీట్లు పంచుకుంటారు. అంతేగాని అధినేత ఎవరికో ఇవ్వమని ఇచ్చిన డబ్బుల మూటలు మోస్తారా? అలా మోసేవారిని సహచరులంటారా? బానిసలంటారా? వాస్తవానికి పార్టీలో ఉన్నంతవరకు నాగం, దేవేందర్, ఎర్రబెల్లి వంటివారే చంద్రబాబు సహచరు లు. తెలంగాణ అంశం మీద బాబు ఎప్పుడూ చర్చించింది సలహాలు తీసుకున్నదీ వీళ్లతోనే.
అసలు రేవంత్ రాజకీయమేమిటి? ఎన్నడన్నా ఒక అంశం మీద నిలబడ్డ సందర్భం ఉన్నదా? ఏ పార్టీకైనా అంకితమై పనిచేసిన సందర్భమున్నదా? ఎప్పటికప్పుడు అవకాశవాద రాజకీయాలు తప్ప ఒక నిలకడగలిగిన నాయకుడేనా? ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుల మీదే రాజకీయాలు చేయడం ఇబ్బందులకు గురి చేయడం వాస్తవం కాదా? టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉన్న తననే బ్లాక్మెయిల్ చేశాడని నాడు టీడీపీలో ఉన్న నేటి మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. దానికి జవాబు ఇచ్చినట్టు లేదు.
రేవంత్ కేసీఆర్ మీద టీఆర్ఎస్ పొత్తుల మీద అనేక ఆరోపణలు చేశాడు. బాజా పత్రికలు చాలాకాలంగా వల్లించినవే అవన్నీ. ఏ పొత్తు ఎందుకు పెట్టుకున్నారో గుండెల్లో తెలంగాణ ఉంటే అర్థమవుతుంది. అనేకసార్లు ఈ పొత్తుల విషయంలో తెలంగాణ మేధావుల సలహాలు కూడా తీసుకున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ఇస్తామంటేనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ అనుకూల ప్రకటనను గాంధీభవన్లోనే ఆనాటి అధ్యక్షుడే చదివాడు. ఆ తర్వాతే పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ దయతో గెలిచారని మరో స్వరం వినిపించారు. అయితే అంతకుముందే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ పొత్తు లేకుండా ఎన్ని ఎంపీటీసీలు గెలిచింది? ఎన్ని జడ్పీల్లో బలమైన పార్టీగా నిలిచింది లోకానికి తెలుసు. అంతేకాదు 2004 నాటికి రాష్ట్రం తెలంగాణ వాదంలో ఎలా ఊగిపోతున్నదీ తెలుసు. ఇక్కడ పొత్తుతోనే ఆంధ్రలో మైలేజీ పెరిగిన విషయం నాటి పత్రికలే రాశాయి. గెలిచి కేంద్ర మంత్రులయ్యారు అంటాడు. అవును కేంద్రమంత్రి కావడం వల్లనే కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశం చేరింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వచ్చింది. కేంద్ర మంత్రులు కావడం వల్లనే వివిధ పార్టీల మద్దతు లేఖలు వచ్చాయి. తెలంగాణకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? పోర్ట్ఫోలియో లేని మంత్రిగానే కేసీఆర్ అనేక నెలలు కొనసాగారు. ఓ సందర్భం వరకు వేచిచూసి ఆ పదవులకు రాజీనామాలిచ్చి కరీంనగర్ ఉప ఎన్నికతో ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోసింది కేసీఆరే. దారి పొడుగునా ఎన్ని కుట్రలు జరిగినా రాళ్లు పడ్డా పూలు పడ్డా చలించక కేసీఆర్ నిలబడటం వల్లనే తెలంగాణ సాకారమైంది తప్ప ఆంధ్ర పార్టీలో ఉండి నేనంత తెలంగాణవాదిని ఇంత తెలంగాణ వాదిని అంటూ ఆవకాయ కబుర్లు చెప్తే కాదు. గుండెలు చీల్చి తెలంగాణను చూపిందెవరో, గుండెల మీద తుపాకీ గురిపెట్టి పరాయి పాలకులకు ఊడిగం చేసిందెవరో ఇవాళ తెలంగాణలో నిక్కరు వేసుకునే పిల్లాడు కూడా చెప్తాడు. తెలంగాణ వ్యతిరేకినైతే ఎన్నికల్లో ఎట్లా గెలిచినా? అనేది రేవంత్ ప్రశ్న. 2014 ఓ సంధికాలపు ఎన్నిక. తెలంగాణ క్రెడిట్ను అన్ని పార్టీలు తమవేనని చెప్పుకుతిరిగాయి. ప్రజలు కూడా గందరగోళపడ్డారు. పైగా టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి కాబట్టి గెలుపు సాధ్యమైంది. మరి 2018లో గెలవలేదే? ఎంపీగా గెలిచిన నియోజకవర్గంలో ఏ ప్రాంతం ఓట్లు అధికంగా ఉన్నాయి? అక్కడికే ఎందుకు వెళ్లినట్టు? సమాధానం రేవంత్ చెప్పాలి. అక్కడి గెలుపు తెలంగాణవాదపు గెలుపే అవుతుందా? జవాబివ్వాలి.
వినేవాడుంటే చెవుల్లో చెట్లు పెడతారని రేవంత్ ఓ విచిత్ర విషయాన్ని చెప్పారు. 2014కు ముందు పక్కోళ్ల పాలన కాబట్టి ఆ విషయాలేవీ తెలంగాణ కాంగ్రెస్కు అంటవట. వాళ్లను అనవద్దట. అవును మరి వాళ్లు సొక్కం బంగారాలు కదా. పోతిరెడ్డిపాడు పొక్కను గట్టిగా సమర్థించింది ఎవరు? పక్కోడి పాలనలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆంధ్రా ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్లు చేసిన వాళ్లెవరు? దోపిడీ చేసిన నీరు సీమకు తరలిస్తే మంగళహారతులు పట్టినవాళ్లెవరు? వైఎస్ ఏదో ఉద్ధరిస్తున్నాడు.
ఇపుడే తెలంగాణ ఇవ్వవద్దు అని సోనియాకు వినతి పత్రం ఇచ్చిందెవరు? ముల్కీరూల్స్ ఎత్తేసే ఆరుసూత్రాల పథకం మీద సంతకాలు చేసిందెవరు? అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి కేరళ రైలెక్కిందెవరు? గడీకోసారి తెలంగాణ అని ప్రజల్లో ఆశలు రేపి అధిష్ఠానంతో బేరాలు చేసుకొని దుకాణాలు మూసేసింది ఎవరు? మరో సైమన్ యాత్ర అని విమర్శలు చేసి పదవి రాగానే పెదవులు మూసిందెవరు? పక్కోడు సరే. వాడి ప్రాంతం వాడు చూసుకుంటాడు. ఆ పక్కోడి క్యాబినెట్లో బెర్తుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టింది ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కదా.
కేసీఆర్ ఎక్కడ రాజీపడ్డా ఈ నాయకులెవరన్నా నోరు తెరిచేవారా? అందరికీ తెలుసు. ఇక తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ నేతలు పోరాడారట. అ వును వైఎస్ మరణం తర్వాత తెలంగాణలోని ఆయన వర్గం గాడ్ఫాదర్ లేక కిరణ్ దగ్గరికి కూడా రానీయకపోతే అప్పుడు కదా ఈ నాయకులకు తెలంగాణ వాదం గుర్తుకువచ్చింది. కేసీఆర్ దీక్ష చేస్తున్నపుడు రో జుకో ప్రెస్మీట్ పెట్టి అడ్డమైన వాగుడు వాగిన వారు హఠాత్తుగా తెలంగాణవాదులు ఎట్లా అయ్యారు? జలయజ్ఞప్రదాతకు ఓట్ల నైవేద్యం అంటూ ప్రచారాలు చేసినవారు వైఎస్ పోయేదాకా ఏనాడన్నా తెలంగాణ ఉద్యమ శిబిరాలకు వెళ్లారా? ఆయన పోయిన తర్వాతే అవి ఎందుకు గుర్తుకువచ్చాయి? తెలంగాణ వాదులకంటే ఎక్కువ గొంతేసుకుని ఎందుకు నినాదాలిచ్చారు? కేసీఆర్ దీక్షకు కాకా మద్దతు ఇస్తే ఆయనపై విరుచుకుపడ్డది… కేసీఆర్ దీక్ష కాంగ్రెస్ను బొందపెట్టడానికే అని ప్రెస్మీట్లలో చెప్పింది ఎవరో తెలియదా? ప్రజలు అమాయకులు కాబట్టి నమ్మవచ్చు. కానీ రాజకీయాల లోతుపాతులు తెలిసినవాళ్లుంటారా?
– మిగతాభాగం రేపు..
-ఎస్జీవీ శ్రీనివాసరావు