హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. అరుదైన సాంస్కృతిక వారసత్వం, విభన్నమైన సంస్కృతి స్వదేశీయులతోపాటు విదేశీయులనూ కట్టిపడేస్తున్నది.గత ఎనిమిదేండ్లలో తెలంగాణ దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా ఎదిగింది.
స్వయంగా నీతి ఆయోగ్, ఎకనమిక్ సర్వేలు తమ నివేదికల్లో తెలంగాణ పర్యాటక ప్రగతిని ప్రశంసించాయి. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రత్యేక ప్యాకేజీలతో తెలంగాణకు టూరిస్టుల రాక విపరీతంగా పెరిగింది. కరోనా, లాక్డౌన్ల కాలంలో పర్యాటకుల రాక తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకొన్నది. రాష్ట్రంలో అద్భుత శిల్పకళకు చిరునామాగా ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇవ్వగా.. భూదాన్ పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్గా యూఎన్డబ్ల్యూటీవో గుర్తింపు పొందింది. ఇవి తెలంగాణ పర్యాటకానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చాయి.