హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం. ఎదురుగా శత్రుమూకలున్నా వెన్ను చూపకుండా తెగువతో పోరాడుతారనే ధీమా. 24 గంటలూ ప్రజారక్షణే పరమా‘విధి’గా, శాంతిభద్రతలను కాపాడటమే ధ్యేయం గా ఎందరో పోలీసులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. 1959 అక్టోబర్ 21న ‘భారత్-టిబెట్ ’ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ వద్ద చైనా సైనికుల నుంచి దేశరక్షణ కోసం 10 మంది భారత కేంద్ర రిజర్వు పోలీసులు అసువులు బాశారు. ఆ రోజున ప్రతియేటా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరులకు నివాళులర్పిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, పోలీసు అమరుల కుటుంబాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక పరేడ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులు అయ్యారని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ వీడియో సందేశంలో చెప్పారు.