హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి ఉద్యమనాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం బీ-ఫాం అందజేశారు. గెల్లుది నిరుపేద కుటుంబం కావడంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ ఫండ్ నుంచి రూ.28 లక్షల చెక్కును సీఎం కేసీఆర్ అందజేశారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయని, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమం రోజుల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లిల్లూ గులాబీ లోగిలేనని, రాష్ట్రం ఆవిర్భవించాక ఈ బంధం రెట్టింపు బలోపేతమైందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులని, టీఆర్ఎస్ ఏ కార్యం తలపెట్టినా నెత్తికెత్తుకుంటారని, పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఆవిర్భావం అనంతర పరిణామాల గురించి సీఎం కేసీఆర్ గెల్లుకు వివరించారు. ఏ మచ్చపడని గెల్లు శ్రీనివాస్ను హుజూరాబాద్లోని ప్రతి ఇల్లు తమ ఇంటి బిడ్డగానే చూస్తున్నారని తనకు సమాచారం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అదే సమయంలో అన్నివర్గాల ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘ఆల్ ద బెస్ట్’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించారు.
‘సార్.. మీరొకసారి హుజూరాబాద్కు రావాలి’ అని గెల్లు శ్రీనివాస్ ఆహ్వానించగానే సీఎం కేసీఆర్ ‘చూద్దాం’ అన్నారు. మనం ప్రజల మనసులల్ల ఉన్నం.. ఇల్లిల్ల్లు తిరుగు.. కడుపుల తలకాయపెట్టు అని గెల్లుకు సీఎం కేసీఆర్ కర్తవ్యబోధ చేశారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ఎన్నికల మార్గదర్శకాలు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. కమలాపూర్ నుంచే తన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.