Motkupalli Narsimhulu | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని.. ఆయన మాదిగల వ్యతిరేకి అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని.. దీంతో క్రమంగా మాదిగలకు ఆ పార్టీ దూరం అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో రేవంత్.. రెడ్డిల రాజ్యం తెస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 80 లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయం అని అభిప్రాయపడ్డారు. మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడంపై ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తానని ప్రకటించారు. మందకృష్ణ మాదిగతో కలిసి దీక్ష చేస్తానని తెలిపారు.