Motkupalli Narasimhulu | పార్లమెంటు ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్కు ఓటేస్తే తనను చంపినట్టే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనల్ని ఎందుకు గుర్తించడం లేదంటూ కంటతడిపెట్టారు. అందరూ ఏకమై ఈ ఎన్నికల్లో మాదిగల బలమేంటో కాంగ్రెస్కు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పుట్టకముందే తాను ఎమ్మెల్యేను అని.. రేవంత్ బెదిరింపులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్ను పాతిపెడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎస్సీల వర్గీకరణ చేయలేకపోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎంపీ సెగ్మెంట్లతో పాటు, కంటోన్మెంట్లో ఒక్క టికెట్ కూడా మాదిగలకు కేటాయించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్, కడియం కుటుంబానికి కూడా టికెట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్య ఎంపీ టికెట్ తెచ్చుకునేంతవరకు కూడా ఆమెకు కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదని తెలిపారు. అలాంటప్పుడు కాంగ్రెస్కు మాదిగలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మాదిగలను కాంగ్రెస్ అవమానపరిచిందని మండిపడ్డారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మాదిగలు, బీసీలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈసీ అనుమతితోనే మహాధర్నా చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షపై కూడా మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజ్యాంగం కోసం కాంగ్రెస్ ధర్నా చేయడం లేదని.. మాదిగల వల్ల నష్టం కాబట్టే ధర్నా చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదు.. మాదిగల ఓట్లతో కాంగ్రెస్కు మాత్రం ప్రమాదం ఉందన్నారు.
సీట్ల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని పిలుపునిచ్చారు. మందకృష్ణ ప్రేరణతో గ్రూప్1 ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ సమాధి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని అన్నారు.