హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తప్పదు. త్వరలో జరుగబోయే యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ దెబ్బకు ప్రధాని మోదీ మూతి పగులుతుందని, అమిత్ షా బొక్కా బోర్లా పడటం ఖాయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీయటం ఖాయం. పంజాబ్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు చావు దెబ్బ తీస్తారని ఎమ్మెల్సీ కడియం పేర్కొన్నారు.
ఎనిమిది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. సంక్షేమ రంగంపై 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం దేశంలో మరేది లేదన్నారు. అభివృద్ధికి సహకరించాల్సిన బీజేపీ నాయకులు మోకాలడ్డుతున్నారని విమర్శించారు. విభజన హామీలైన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ మీద బీజేపీ ఎంపీలు మాట్లాడలేక పోయారని విమర్శించారు.
మంత్రి కిషన్ రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తెచ్చారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. రాజకీయంగా తప్పోప్పులపై మాట్లాడాలి తప్ప..వ్యక్తిగత దూషణలు సరికాదని హితవు పలికారు.
బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం పనితీరు వల్లే దేశంలో అసమానతలు పెరిగాయని ఎమ్మెల్సీ కడియం విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి నిరుద్యోగ సమస్యను పెంచారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి ప్యాకేజీలు ప్రకటిస్తారు.
మధ్యప్రదేశ్, కర్ణాటకలో దొడ్డి దారిన అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమి కడతారన్న భయంతోనే మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ రైతు, దళిత వ్యతిరేక పార్టీ. అలాంటి పార్టీని బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు మానాలని హితవు పలికారు.
రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏ రూపంలో కలిసి పనిచేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు.