హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) నూతన అధ్యక్షుడ్ని ఈ నెల 19న ఎన్నుకోనున్నారు. గురువారం టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరుగనున్నది. ప్రస్తుత అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే. ఆయన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో 19న సమావేశానికి హాజరుకావాలని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు మంగళవారమే సమాచారమిచ్చారు.
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు రాజేందర్ ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 20న వీఆర్ఎస్కు ఆమోదం లభించే అవకాశం ఉన్నది. వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే, శుక్రవారం తన అనుచరులలో కలిసి రాజేందర్ బీఆర్ఎస్లో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.