టీఎన్జీవోల తీర్మానం
టీఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటన
డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపుపై సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : ఉద్యోగుల ఆరోగ్య బీమా (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. శనివారం టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ సహా 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జీవో-317తో మెజార్టీ ఉద్యోగులకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో స్పౌజ్ కేసులను పరిగణనలోకి తీసుకోవాలని, పరస్పర బదిలీల్లో జోనల్ ఉద్యోగుల సీనియార్టీకి రక్షణ కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిల విడుదలకు ఉత్తర్వులు జారీచేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
సక్రమమైన అప్పీళ్లను పరిష్కరించాలి
అన్ని స్థాయిల్లో సక్రమమైన అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. పీఆర్సీ వ్యత్యాసాలను సవరించేందుకు వెంటనే అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని జీవోలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కోసం రాష్ట్రస్థాయిలో కమిటీని నియమించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్ పొందిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సాధారణ బదిలీలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీచేయాలని, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం 2022 సంవత్సర డైరీ, క్యాలెండర్ను ఆవిషరించారు.