యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించారు. స్వామివారిని గరుఢ వాహనసేవ, అమ్మవారిని తిరుచ్చి వాహన సేవపై వేంచేపు చేసి ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. పశ్చిమ సప్తతల రాజగోపురం నుంచి తిరుమాఢవీధులు తిరుగుతూ ఉత్తర పంచతల రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి సేవ సాగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన చేపట్టారు.
ప్రధానాలయ గర్భగుడిలో స్వయంభూ ఉత్సవమూర్తులకు తీర్ధం, పంచామృతాలతో అభిషేకం జరిపారు. అష్టోత్తరం నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేసి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, ఉభయ దర్శనాలు సాగాయి. సాయంత్రం స్వామివారికి నిర్వహించిన దర్భార్ సేవలో, స్వామివారి పలు వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని 16 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఖజానాకు రూ.22,94,511 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.