Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దేవతామూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చి సేవపై తిరుమాఢవీధుల్లో ఊరేగించారు.
తెల్లవారుజామున 3:30 గంటలకు స్థాన సుప్రభాతాన్ని ఆలకించి స్వామివారిని మేల్కొలిపారు. స్వామివారి తిరువారాధన చేపట్టి స్వామివారికి బాలభోగం నివేదన నిర్వహించారు. నిత్యబలి ప్రదానం మంగళాశాసనంతో ప్రాబోదిక కార్యక్రమానికి ముగింపు పలికి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. ఉదయం, సాయంత్రం సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామివారి సుదర్శన నారసింహహోమం, సువర్ణపుష్పార్చనలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు.
సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 14 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.18,60,679 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.