Sanath Nagar TIMS | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది. నాడు హైదరాబాద్ నగరం చుట్టూ ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ ప్రాంతాల్లో టిమ్స్ దవాఖానలకు శంకుస్థాపనలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సనత్నగర్ టిమ్స్ దవాఖాన భవన నిర్మాణం, ఇతర పనులు 65% వరకు పూర్తయ్యాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. ఆ పనులు ముందుకు సాగడమే లేదు. టిమ్స్ ప్రారంభోత్సవానికి మోక్షం లభించడం లేదు. పదే పదే వాయిదాలు వేస్తూ రాష్ట్రప్రభుత్వం అభాసుపాలవుతున్నది. గతంలో సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న, ఆ తర్వాత సంక్రాంతి, తాజాగా ఉగాది అంటూ ప్రభుత్వం విధించిన గడువులు దాటిపోతున్నాయి. వెరసి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం తెలంగాణ ప్రజానీకానికి ఎదురుచూపులు తప్పడం లేదు. వాయిదాలు, గడువులతో కాలం వెల్లదీస్తున్న సర్కార్ తీరుపై విస్మయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న దవాఖానను ప్రారంభిస్తామని మరో గడువును రాష్ట్ర ప్రభుత్వం విధించుకోవడం కొసమెరుపు.
టిమ్స్ ఆరంభం వాయిదాకు వివిధ సాకులను వైద్యరోగ్యశాఖ అధికారులు చెప్తున్నా.. అసలు కారణం పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు బిల్లులు చెల్లించకపోవడమేనని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలకు ఎక్విప్మెంట్ సరఫరా చేసిన కంపెనీలకే.. సనత్నగర్ టిమ్స్కు పరికరాలు సైప్లె చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. మెడికల్ కాలేజీలకు మౌలిక వసతుల కల్పనలో మేజర్, మైనర్ పరికరాలు కలిపి మొత్తం 90 రకాల పరికరాలు సరఫరా చేశాయి.
2024 డిసెంబర్ నుంచి పెండింగ్లో ఉన్న రూ.120 కోట్లు చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది. ఈ నిధులు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం వద్ద రూ.200 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 వరకు ఆ బిల్లులు క్లియర్ చేయని పక్షంలో ఆ నిధులు ల్యాప్స్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఎక్విప్మెంట్ సరఫరా చేసిన 50 కంపెనీలు వెంటనే తమ బిల్లులు క్లియర్ చేయాలని, చేస్తేనే ఇతర పరికరాలు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నాయి. ఈ కారణంగానే కేవలం 30% ఎక్విప్మెంట్తో సనత్నగర్ టిమ్స్లో పనులను నెట్టుకొస్తున్నట్టు తెలిసింది. మేజర్ పరికరాలు లేని కారణంగా ఆర్అండ్బీ శాఖ సైతం కొన్ని పనులను పెండింగ్లో పెట్టినట్టు సమాచారం.
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న సదుద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన టిమ్స్ దవాఖానలపై ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ ప్రాంతాల్లో టిమ్స్ దవాఖానలకు నాడు కేసీఆర్ శంకుస్థాపనలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సనత్నగర్ టిమ్స్ పనులు 65% పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. పనుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదనే విమర్శలున్నాయి. నిరుడు డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజున సనత్నగర్ టిమ్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.
పనులు పూర్తికాకపోవడంతో సంక్రాంతికి వాయిదా వేశారు. ఆనాటి వరకూ సైతం పనులు పూర్తికాకపోవడంతో ఉగాదిని గడువుగా విధించారు. ఇంకా పూర్తిస్థాయిలో సనత్నగర్ టిమ్స్ పనులు పూర్తికాని కారణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని తాజాగా వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా టిమ్స్ను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్న ఆ లక్ష్యం సైతం నెరవేరుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.