Asifabad | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తున్నది. సిర్పూర్(టి) మండటం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేకెత్తిస్తున్నది. రెండు రోజుల వ్యవధిలో మూడు పశువులు, ఇద్దరు మనుషులపై దాడికి పాల్పడింది. శనివారం లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది. కెనాల్ ఏరియాలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు జల్లెడ పట్టారు. పులి మానటరింగ్ కోసం 10 ప్రత్యేక బృందాలను, 200 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి ఆచూకీని గుర్తించేందుకు డ్రోన్ను వినియోగించి మహారాష్ట్రకు రెండు కిలో మీటర్ల దూరంలో పులి ఉన్నట్టు గుర్తించారు. శుక్రవారం చేనులో పని చేస్తున్న ఓ మహిళపై పులి దాడి చేయగా ఆమె చనిపోయింది. శనివారం సురేశ్ అనే రైతుపై దాడి చేయగా అతడు మంచిర్యాల దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఆవును చంపిన చిరుత
బజార్హత్నూర్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి అటవీ ప్రాంత శివారులో చిరుత పులి ఆవుపై దాడి చేసి చంపింది. అటవీ అధికారి పుండలిక్ వివరాల ప్రకారం బుర్కపల్లికి చెందిన రైతు రవి శనివారం ఆవును మేపేందుకు అడవి సమీపంలోకి పంపాడు. రాత్రి వరకు ఆవు తిరిగి రాకపోవడంతో ఆదివారం ఉదయం గాలించగా ఆవుపై చిరుత దాడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. ఆవు విలువ రూ.30 వేలకు పైగా ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు.
ఆపరేషన్ టైగర్
ఆసిఫాబాద్ జిల్లాలోని 15 గ్రామాల్లో అధికారులు 163సెక్షన్ విధించారు. కవ్వాల్ అభయారణ్యంలో నాలుగేళ్లలో పులుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబర్లో సహజంగా మగ ఆడ పులులు జతకట్టే సమయం అని, అందులో భాగంగా పులులు సాధారణం కంటే తమ జోడు కోసం అడవిలో ఎకువ దూరం ప్రయాణం చేస్తుంటాయని అధికారులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో అడవిని దాటి చుట్టుపకల ప్రాంతాల్లోనూ సంచరిస్తూ ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో పులులు సహజంగా కొంత ఉద్రేకంతో ఉంటాయని తెలిపారు. తమ తోడును వెతుకునే క్రమంలో పులులు చురుకుగా తిరుగుతూ ఉంటాయని, అందుకే నవంబర్,డిసెంబర్లో పులి దాడులు పెరుగుతున్నాయని అధికారులు వివరించారు.